Jagitial Crime News : జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవ్పేట గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో, అత్తనే హతమార్చాలని ప్లాన్ వేసిన అల్లుడు.. విద్యుత్ షాక్తో ఆమెను చంపేందుకు చేశాడు. చివరకు ప్రయత్నం విఫలమై చివరకు పోలీసులకు చిక్కాడు. సుమారు 25 ఏళ్ల క్రితం వివాహమై, ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో చేలరేగిన వివాదం స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48)కి, అదే గ్రామానికి చెందిన పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భర్తతో గొడవపడి పద్మ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లి గడ్డం రాజవ్వ దగ్గరే ఉంటూ, భర్త పిలిచినా తిరిగి కాపురానికి రావడానికి నిరాకరించింది.
తన భార్య కాపురానికి రాకపోవడానికి అత్త రాజవ్వే ప్రధాన కారణమని మల్లారెడ్డి బలంగా నమ్మాడు. అత్త బతికి ఉన్నంత కాలం తన భార్య తిరిగి రాదని భావించిన అతడు, ఆమెను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2026 రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న వేళ.. రాజవ్వ ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభం నుండి ఒక వైరును అక్రమంగా లాగాడు. ఆ వైరును రాజవ్వ నివసిస్తున్న ఇంటి ప్రధాన దర్వాజా ముందున్న ఇనుప రాడ్కు కనెక్షన్ ఇచ్చాడు. తెల్లవారుజామున ఆమె తలుపు తీసి బయటకు రాగానే ఆ రాడ్ను తాకి విద్యుత్ షాక్తో మరణించేలా పక్కాగా అమర్చాడు.
మరుసటి రోజు ఉదయం రాజవ్వ నిద్రలేచి తలుపులు తెరవగానే, ఆమె కాలుకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. ఏదో ప్రమాదం ఉందని గ్రహించిన ఆమె వెంటనే కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించారు. అక్కడ అమర్చిన ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లను చూసి అందరూ నిర్ఘాంతపోయారు. రాజవ్వ వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన అత్తను చంపాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.