Srikakulam Quarry Blast: శ్రీకాకులం జిల్లా మెలియాపుట్టి మండలంలో.. విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడి జంగాలపాడులోని రాజయోగి క్వారీలో బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పేలుడు ధాటికి సమీపంలోని గోడలు, యంత్ర పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో, ఆయనను విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినట్టు అధికారులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్వారీ కార్యకలాపాలపై ప్రాథమిక విచారణ ప్రారంభించారు. బ్లాస్టింగ్ సమయంలో సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాస్ట్ కు కారణం ఏమిటి, ఏ రకం పేలుడు పదార్థాలు ఉపయోగించబడ్డాయి, సేఫ్టీ మేజర్లు ఉన్నాయా అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతుంది అని పోలీసులు వెల్లడించారు.
క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పదేపదే పేలుళ్లు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు.
Also Read: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు ఆపుతారో చూస్తాం: గుడివాడ అమర్నాథ్
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు.. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సూచనలతో అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.