Tandoor Murder Case: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆస్తి తగాదాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఇంటిపై నిర్మించిన గది విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక అన్న తన తమ్ముడినే అత్యంత దారుణంగా హతమార్చాడు.
తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాంతానికి చెందిన మోసిన్, రెహమాన్ అన్నదమ్ములు. తమ్ముడు రెహమాన్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, అన్న మోసిన్ తాండూర్-గౌతాపూర్ మార్గంలో పంక్చర్ షాపు నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఇంటి మిద్దెపై కట్టిన గది విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ ఆస్తి వివాదాన్ని తేల్చుకుందామని అన్న మోసిన్ ఆదివారం ఉదయం తన తమ్ముడిని హైదరాబాద్ నుండి తాండూరుకు పిలిపించాడు.
ఆదివారం ఉదయం ఇద్దరు అన్నదమ్ములు చర్చించుకుంటుండగా గది విషయంపై మళ్ళీ ఘర్షణ మొదలైంది. వివాదం ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మోసిన్, తన బావమరిది సహాయంతో తమ్ముడు రెహమాన్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శరీరంలో పలుచోట్ల కత్తిపోట్లు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి రెహమాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పట్టపగలే జరిగిన ఈ దారుణ హత్య చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు ‘100’కు డయల్ చేసి సమాచారం అందించడంతో, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మోసిన్, అతనికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: షాకింగ్ ఘటన.. చంపినా వారితో ఉంటా, భార్యని చంపేసి ఆ తర్వాత..