Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అమ్మమ్మ చంద్రమ్మ (50)తో పాటు ఆమె మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14) నిద్రలోనే కాలిబూడిదవ్వడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇళ్లలో వెతకగా పూర్తిగా కాలిపోయిన మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాత్రి వేళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని, ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు అంటుకోవడం వల్లే ఈ భారీ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ధాన్యం రవాణా ఆలస్యంపై మెదక్ ఎస్పీ యాక్షన్.. డీఎస్పీకి కీలక ఆదేశాలు!