Medak SP: స్వేచ్చ బ్యూరో: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శుక్రవారం మెదక్ లోని దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, ఎస్ఐ నారాయణతో కలిసి కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేక కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు బ్లాక్ టార్పాలిన్లు అవసరమని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్తో ఫోన్లో మాట్లాడి రైతులకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీల కొరతపై కూడా ఎస్పీ స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రైతులకు లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ను ఆదేశించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని, రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్, దిష్టిబొమ్మ దహనం!