Siddipet: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం నాచారం గ్రామంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన ముగ్గురు యువకులు హల్దీ వాగులో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో తీరని శోకాన్ని నింపింది. సెలవు దినం కావడంతో ముగ్గురు మిత్రులు కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వాగు వద్దకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది.
నీటిలోకి దిగిన కొద్దిసేపటికే ముగ్గురూ ఒక్కసారిగా గల్లంతయ్యారు. స్థానికులు గమనించి వెంటనే అప్రమత్తమైనప్పటికీ, అప్పటికే వారు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఒక్కగానొక్క కొడుకులు, చేతికి వచ్చిన యువకులు ఇలా కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
సాధారణంగా వర్షాకాలంలో వాగులు, వంకలు నిండుగా ఉన్నప్పుడు లోతు తెలియకుండా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నాచారం గ్రామం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రాహుల్పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు!