Truck Accident: ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వారణాసి-శక్తి నగర్ రహదారిపై హథినాల హత్వాని సమీపంలో రెండు ట్రక్కులు అతివేగంతో ఎదురెదురుగా ఢీకున్నాయి.. ఢీకొన్న మరుక్షణమే ఇంధన ట్యాంకులు పగిలి మంటలు చెలరేగగా, అవి చూస్తుండగానే వాహనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. మరో డ్రైవర్ వాహన కేబిన్లోనే చిక్కుకుపోయాడు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు సహాయం అందించడానికి బదులు, తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం అత్యంత విచారకరం. ఆ డ్రైవర్ తనను కాపాడమని మంటల మధ్య నుండి కేకలు వేస్తున్నా, చుట్టుపక్కల వారు నిస్సహాయంగా నిలబడి రికార్డింగ్లు చేయడమే తప్ప ముందుకు రాలేదు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడాలనే ఆలోచన కంటే, ఆ దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలనే తాపత్రయమే అక్కడ కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, సరైన సమయానికి ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మంటలు అదుపులోకి వచ్చేసరికి ఆ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ప్రాణం కంటే వైరల్ వీడియోలకే ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షతగాత్రుడైన మరో డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:పల్సర్ 180 vs అపాచీ RTR 180.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?