TV Blast: వేసవికాలంలో అప్పుడప్పుడు ఇంట్లో గ్యాస్ సిలెండర్లు పేలిన సందర్భాలు కనిపించేవి. వేడి అధికంగా ఉండడంతో ఇలా జరిగేదని అనుకునేవారు. ఆ గాలి ఇప్పుడు వాషింగ్ మెషీన్లు, బాత్రూం హీటర్లు, టీవీలకు సోకింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులు టపాకుల మాదిరిగా పేలుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అలాంటి అన్నమయ్య జిల్లాలో టీవీ పేలుడు కలకలం రేపుతోంది.
టపాసుల మాదిరిగా పేలిన ఇంట్లో టీవీ
అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని గువ్వల చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగమ్మ.. తన కోడలు నివాసం ఉంటోంది. శుక్రవారం(ఇవాళ) ఉదయం ఆమె కోడలు ఆరు బయట ముగ్గు వేస్తోంది. ఆ సమయంలో నాగమ్మ ఇంట్లో టీవీ చూస్తోంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ టీవీ టపాసుల మాదిరగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది.
ఈ పేలుడు దాటికి ఇంట్లోని గోడలు, తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. సామాగ్రి, నిత్యవసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో నాగమ్మకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కడప రిమ్స్కు తరలించారు.
ఓ మహిళకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించే పనిలోపడ్డారు. ముసలమ్మ, ఆమె కొడలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు.
తాము ఎప్పుడూ ఇలాంటి ఘటనను చూడలేదని చెబుతున్నారు. టీవీ పేలుడు వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లూస్ టీమ్, జాగిలలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. వారికి లభించిన సమాచారం సేకరించారు.
ALSO READ: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఇద్దరు మృతి