Suraram Crime: హోలీ పండుగ వేళ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రంగులు చల్లుకుని ఆనందంగా గడపాల్సిన ఆ సమయం, ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం ఒంటికి అంటుకున్న రంగులను కడుక్కోవడానికి , స్నానం చేయడానికి సాగర్ (17), అభిషేక్ (17) అనే ఇద్దరు యువకులు తమ స్నేహితులతో కలిసి స్థానిక పంతులు చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగిన వీరు ప్రమాదవశాత్తూ చెరువులోని లోతైన ప్రాంతానికి చేరుకున్నారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో ఊపిరాడక ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
యువకులు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన తోటి స్నేహితులు , స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఇద్దరూ మైనర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పంచనామా నిర్వహించిన అనంతరం, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా అందరినీ కలచివేసింది.
Also Read: కూల్డ్రింక్ చిచ్చు.. ప్రాణభయంతో ఐదుగురు విద్యార్థులు పరార్!