రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం నుండి ఒకరికి అవకాశం దక్కుతుందా..? లేదా ఇద్దరికి ఇస్తారా..? అనేది త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆ పార్టీ కేవలం కార్పొరేట్ శక్తులకే రాజ్యసభ అవకాశాలు కల్పించిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక్కరికైనా బీఆర్ఎస్ పెద్దల సభకు వెళ్లే అవకాశం ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
కార్పొరేషన్ పదవుల భర్తీపై పార్టీలో కసరత్తు జరుగుతోందని మహేష్ గౌడ్ వెల్లడించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. మంత్రి పొంగులేటి ఇప్పటికే వాటికి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విజయన్ మాట్లాడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయాల్లో మార్పు మొదలైందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోకుండా అటకెక్కాయని విమర్శించారు. సామాన్య ప్రజలు ఇప్పుడు మోదీ పాలనను కోరుకోవడం లేదని చెప్పారు. ఇండో-అమెరికా ట్రేడ్ ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
పార్టీ బలోపేతం కోసం మంత్రులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నెలకు ఒకసారి మంత్రులు తమ పరిధిలోని డీసీసీ కార్యాలయాల్లో కూర్చోవాలని సూచించారు. మంత్రులు ఎవరూ డీసీసీల శిక్షణకు రావొద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యమని మహేష్ గౌడ్ వివరించారు.
ALSO READ: Weather News: రానున్న 4 రోజులు జాగ్రత్త..! ఈ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్, బయటకు రావొద్దు..!