Road Accident: రాయచోటి–గాలివీడు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా రాయచోటి మండలం మాధవరం వడ్డెపల్లె గ్రామానికి చెందిన రేపన వెంకటసాయికుమార్ (24), రేపన లక్ష్మీప్రసాద్ అలియాస్ ప్రతాప్ (18) ఇద్దరూ ద్విచక్ర వాహనంపై రాయచోటి నుంచి గాలివీడు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో యంపల్లి గ్రామ సమీపంలోని ఏకో పార్కు వద్ద రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో రహదారి పనులు జరుగుతున్నాయని సూచించే హెచ్చరిక బోర్డులు,ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు.
పల్సర్ వాహనంపై వస్తున్న యువకులు కల్వర్టువు గుర్తించకపోవడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంకటసాయికుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీప్రసాద్ అలియాస్ ప్రతాప్ను స్థానికులు వెంటనే సహాయం చేసి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలోనే ఆయన కూడా మృతి చెందారు.
మరణ వార్త తెలియగానే మాధవరం వడ్డెపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, వాహనదారులు ఈ ప్రమాదానికి రహదారి పనుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు రోడ్డుపై పనుల సమాచారం తెలిపే సూచికలు ఏర్పాటు చేసి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేదే కాదని అంటున్నారు.
Also Read: ఇంటి ముందు కూర్చొంచే.. ట్రక్ రూపంలో వచ్చిన మృత్యువు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.