UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన ప్రేయసిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు ముక్కులుగా చేశాడు. వాటిలో కొన్నింటిని కాల్చి వేసి సాక్షాలు మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మరికొన్ని శరీర భాగాలను ఆటోలో తరలిస్తుండగా.. డ్రైవర్ కు అనుమానం వచ్చి పోలీసులు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు.. తన భార్య, కొడుకు సహాయంతో ఈ నేరాన్ని చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలు డబ్బులు డిమాండ్ చేయడంతో హత్య చేసినట్లు నిందితుడు పోలీసులు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.
సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మ నగర్ లో తన ఆటోలో ఎక్కిన వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాయని ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి వద్ద ఉన్న పెట్టె నుంచి దుర్వాసన వస్తుందని తెలిపాడు. ఈ సమాచారంతో పోలీసులు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రామ్ సింగ్ ఇంటికి చేరుకుని.. అతడి వద్ద ఉన్న పెట్టె తాళం పగలగొట్టి చూశాడు. అందులో మహిళ ఎముకలు, కాలిపోయిన శరీర భాగాలను గుర్తించారు.
రామ్ సింగ్ కుమారుడు నితిన్ను విచారించగా, తన తండ్రి రామ్ సింగ్ రైల్వేలో పదవీ విరమణ చేసి సిప్రీ బజార్లోని బ్రహ్మ నగర్లో అద్దెకు ఉంటున్నాడని చెప్పాడు. ప్రీతి అనే మహిళతో కొన్ని సంవత్సరాలుగా రామ్ సింగ్ ఉంటున్నాడని చెప్పాడు. శనివారం రాత్రి తండ్రి ఈ పెట్టెతో ఇంటికి వచ్చాడని చెప్పాడు. వారం క్రితమే రామ్ సింగ్… తన ప్రియురాలు ప్రీతిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి కొన్నింటిని కాల్చివేశారు. ఆ బూడిదను సంచులలో వివిధ ప్రాంతాల్లో పారవేశారు. మిగిలిన భాగాలను ఒక పెట్టెలో పెట్టి తరలిస్తుండగా పట్టుబడ్డారు.
Also Read: ఆస్తి సెటిల్మెంట్ అని పిలిచి.. తమ్ముడిని చంపిన అన్న!
ఎస్పీ సిటీ ప్రీతి సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే మాజీ ఉద్యోగి భార్య గీత విచారణలో తాను రామ్ సింగ్ రెండో భార్య అని తెలిపింది. కొంతకాలంగా, రామ్ సింగ్ ప్రీతి అనే మహిళను తన మూడో భార్యగా చెబుతూ.. ఆమెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆమె రామ్ సింగ్ ను డబ్బు కోసం బెదిరించింది. దీనితో తన భర్త ప్రీతిని హత్య చేశాడని రామ్ సింగ్ భార్య గీత తెలిపింది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పెట్టెలో దొరికిన ఎముకలు, అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి మాజీ భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.