Vijayawada Crime: విజయవాడలో దారుణం జరిగింది. మందు తాగేందుకు రూ.10 ఇవ్వలేదని, బాలుడు వృద్ధుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. విజయవాడ చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలుడు మద్యం కొనడానికి డబ్బులు తక్కువకావడంతో అక్కడే ఉన్న వృద్ధుడు బుల్ రాజును రూ.10 ఇవ్వమని కోరాడు. అయితే వృద్ధుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురైన మైనర్ అతడిపై కత్తితో దాడి చేశాడు. మైనర్ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడే కుప్పకూలాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వృద్ధుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మైనర్ దాడిలో మరణించిన బుల్ రాజు స్థానికంగా తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వృద్ధుడి స్వస్థలం మంగళగిరి నులకపేట అని తెలుస్తోంది. దాడికి పాల్పడిన మైనర్ ను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇంతలో బాలుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో కేవలం రూ.10 లకు హత్య చేయడంపై.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో ఇటీవల గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం కేసులు పెరుగుతున్నాయి. గంజాయి మత్తులో కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. అజిత్సింగ్నగర్లో పాత గొడవల కారణంగా గంజాయి మత్తులో యువకుడు వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ మహిళ ఇంటి వద్దకు వెళ్లి యువకుడు వీరంగం సృష్టించాడు. రాళ్లతో తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశాడు. భయంతో బాధితులు ఇంట్లోనే ఉండిపోయారు. మహిళ కుమారుడిని చంపేస్తానని యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశారు.
Also Read: Vijayawada Crime: మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. వృద్ధుడిని హత్య చేసిన బాలుడు