Food poisoned: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి వసతి గృహంలో ఏర్పాటు చేసిన భోజనం తిన్న తర్వాత సుమారు 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులు వరుసగా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడటంతో హాస్టల్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
అస్వస్థతకు గురైన వారిలో 16 మంది పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది. వీరు తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడటంతో హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్లను పిలిపించి, బాధితులను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్వయంగా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైతే స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాకతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (DM&HO) ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. వసతి గృహంలో వండిన ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపాలని నిర్ణయించారు. వంట తయారీలో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముళ్లపొదలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. స్పాట్ లో 40 మంది విద్యార్థులు
ఈ సంఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వార్డెన్ మరియు ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరూ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.