Warangal: వరంగల్ జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి చేసిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికులను ఉలిక్కిపడేలా చేస్తోంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్లో గత నెల మార్చి 17న జరిగిన ఈ ఘోరం, గంజాయి మత్తులో యువత ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో అద్దం పడుతోంది. నడుచుకుంటూ వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ బైకుతో ఢీకొట్టడమే కాకుండా, విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాపాయ స్థితికి చేర్చారు.
కేవలం ఢీకొట్టడంతో ఆగకుండా.. ఆ గంజాయి బ్యాచ్ సభ్యులు ఒక పెద్ద బండరాయిని తీసుకుని సురేష్ రెండు కాళ్లను చితక్కొట్టారు. అంతటితో వారి పైశాచికత్వం చల్లారలేదు, అతని ఛాతిపై పిడిగుద్దులతో బాదుతూ తీవ్రంగా హింసించారు. ఈ క్రూరత్వాన్ని వారే స్వయంగా సెల్ ఫోన్లలో వీడియో తీసుకోవడం వారి ఉన్మాదానికి పరాకాష్ట. తీవ్ర గాయాలతో సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. అతను చనిపోయాడని భావించిన నిందితులు.. అంబులెన్స్కు ఫోన్ చేయాల్సింది పోయి, బాధితుడిని అతని ఇంటి దగ్గర పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ప్రస్తుతం సురేష్ ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని రెండు కాళ్లు పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడు కళ్యాణ్గా గుర్తించారు. అయితే, ఈ గంజాయి ముఠాల ఆగడాల వల్ల స్థానికులు రాత్రి వేళల్లో రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు గస్తీ పెంచి ఇలాంటి గంజాయి బ్యాచ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గాంధీ నగర్ ప్రజలు కోరుతున్నారు.
Also Read: బీహార్లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. 30 మందికి గాయాలు