Fake Trading App: ఈజీ మనీ కోసం ఆశపడితే ఎంతటి వారైనా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోక తప్పదని వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో నమ్మించి ఒక ప్రైవేట్ లెక్చరర్ నుంచి ఏకంగా రూ. 37 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఎస్బీఐ’ (SBI) పేరును వాడుకుని ఈ మోసానికి పాల్పడటం గమనార్హం.
బాధితుడు వరంగల్లో ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఫేస్బుక్లో “స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై నిపుణుల సలహా” అంటూ వచ్చిన ఓ ఆకర్షణీయమైన ప్రకటనను చూసి క్లిక్ చేశారు. అది వెంటనే ‘ఎస్బీఐ సెక్యూరిటీస్ డిస్కషన్’ (SBI Securities Discussion) అనే వాట్సాప్ గ్రూప్కు దారి తీసింది. ఆ గ్రూప్లో చేరిన తర్వాత, నేరగాళ్లు ఎస్బీఐ సెక్యూరిటీస్ పేరుతో ఉన్న ఒక నకిలీ మొబైల్ అప్లికేషన్ను (Fake App) అతనితో ఇన్స్టాల్ చేయించారు. ఇందులో పెట్టుబడి పెడితే 20 శాతం కచ్చితమైన లాభాలు వస్తాయని నమ్మబలికారు.
బాధితుని పేరుతో నకిలీ డీమ్యాట్ అకౌంట్ తెరిచిన నేరగాళ్లు, అందులో లాభాలు వస్తున్నట్లు నమ్మించారు. దీంతో బాధితుడు విడతల వారీగా రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ‘మేనేజ్మెంట్ ఫీజు’ కింద మరో రూ. 17 లక్షలు చెల్లించాలని మెలిక పెట్టారు. తన డబ్బు వస్తుందన్న ఆశతో బాధితుడు ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు.
మొత్తం రూ. 37,11,536 చెల్లించిన తర్వాత కూడా విత్డ్రా కాకపోవడం, అటువైపు నుంచి స్పందన కరువవ్వడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ బ్యూరోను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి దారుణ హత్య.. అరాచాకలకు పులిస్టాప్ పడేదెప్పుడు..?