బంగ్లాదేశ్లో అస్థిరత కొనసాగుతున్న వేళ.. మైనారిటీ హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆందోళనల మధ్య మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మైమెన్సింగ్ జిల్లా భలుకా ప్రాంతంలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్న బజేంద్ర బిశ్వాస్ (40) అనే హిందూ వ్యక్తిని అతని సహోద్యోగి కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మృతుడు బజేంద్ర బిశ్వాస్ మైమెన్సింగ్లోని ఒక ప్రైవేట్ పరిశ్రమలో అన్సార్ (స్థానిక రక్షణ కమిటీ) సభ్యుడిగా విధుల్లో ఉన్నాడు. అదే సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నోమన్ మియా అనే సహోద్యోగితో బజేంద్రకు స్వల్ప వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నోమన్ మియా తన వద్ద ఉన్న తుపాకీతో బజేంద్రపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన బజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు నోమన్ మియాను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భలుకా మోడల్ పోలీస్ స్టేషన్ అధికారులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేదా మరేదైనా కోణం ఉందా అనే దిశగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భయాందోళనలో మైనారిటీలు..
బంగ్లాదేశ్లో ఇటీవలి రాజకీయ పరిణామాల తర్వాత హిందూ సమాజంపై నిరంతర దాడులు జరుగుతున్న తరుణంలో.. ఈ హత్య మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రక్షణ కమిటీలో పనిచేస్తున్న వ్యక్తికే రక్షణ లేకుండా పోయిందని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, హిందూ మైనారిటీలకు భద్రత కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.