Khammam: ఖమ్మం నగరంలోని రెసోనెన్స్ స్కూల్లో వార్డెన్ బరితెగించి ఒక విద్యార్థిపై అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. క్రమశిక్షణ పేరుతో సదరు వార్డెన్ ఆ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో, బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి దాడులు జరగడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో విద్యాసంస్థ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డపై దాడికి పాల్పడిన వార్డెన్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అతడిని విధుల్లోంచి తొలగించే వరకు తాము వెనక్కి తగ్గబోమని వారు స్పష్టం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా తల్లిదండ్రులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కలిసి ఖమ్మం నగరంలోని కీలకమైన ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత కరువైందని, ప్రైవేట్ పాఠశాలలు కేవలం ఫీజుల వసూళ్లపైనే దృష్టి పెడుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ నినాదాలు చేశాయి.
Also Read: భారీ అగ్ని ప్రమాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా దృష్టి సారించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల భద్రతపై కచ్చితమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.