Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక బృందావనం ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు దద్దరిల్లడమే కాకుండా, కంపెనీ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం 11 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రత దృష్ట్యా రియాక్టర్లు ఉన్న విభాగం పూర్తిగా ధ్వంసమైందని, దట్టమైన పొగ కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, రెండు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. మంటలు పక్కనే ఉన్న ఇతర విభాగాలకు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రియాక్టర్లలో రసాయన ప్రక్రియ జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కేవలం 11 మంది మాత్రమే ఉండటం వల్ల పెద్ద ప్రాణనష్టం తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రస్తుతం ఫార్మా కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కంపెనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.