పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో అత్యంత దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక బూత్ లెవల్ ఆఫీసర్ (BLO), తన ప్రియురాలి భర్తను కిరాతకంగా చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రిజ్వాన్ హసన్ మొండల్ అనే బీఎల్ఓతో పాటు, అతడికి సహకరించిన సాగర్ గైన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 30 ఏళ్ల నాసిర్ అలీ అనే వ్యక్తి భార్యతో బీఎల్ఓ రిజ్వాన్ హసన్ మొండల్కు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అలీని అడ్డు తొలగించుకోవాలని రిజ్వాన్ ప్లాన్ వేశాడు. ఈ నెల సోమవారం సాయంత్రం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పనులకు సంబంధించి ఏదో సమస్య ఉందని సాకుగా చూపి, అలీని ఒక నిర్మానుష్య ప్రాంతానికి రిజ్వాన్ పిలిపించాడు.
ముక్కలుగా నరికి విసిరేశారు..
అలీ అక్కడకు చేరుకోగానే రిజ్వాన్, అతని స్నేహితుడు సాగర్ గైన్ కలిసి అలీని హత్య చేశారు. సాక్ష్యాలను మాయం చేసే క్రమంలో మృతదేహాన్ని దారుణంగా ముక్కలుగా నరికి బదురియా ప్రాంతంలోని ఒక కాల్వలో మూడు వేర్వేరు చోట్ల పడేశారు. మంగళవారం నుంచి అలీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రిజ్వాన్ కాల్ డేటాను విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. శుక్రవారం నాడు కాల్వ నుంచి శరీర భాగాలను వెలికితీశారు.
ఈ దారుణ ఉదంతం తెలియగానే స్థానిక ప్రజలు ఆగ్రహంతో రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుమారు అరగంట పాటు ఆందోళన చేశారు. పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నిరసనను విరమింపజేశారు. నిందితులపై హత్య, సాక్ష్యాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నోయిడాలో మరో విషాదం..
మరోవైపు, దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలోని నోయిడాలో కూడా ఇలాంటిదే మరో విషాదకర ఘటన వెలుగు చూసింది. పార్క్ చేసి ఉన్న కారులో ఒక పురుషుడు, ఒక మహిళ తలలో బుల్లెట్ గాయాలతో శవమై కనిపించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రియురాలిని కాల్చి చంపి, ఆ తర్వాత వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు (Murder-Suicide) పోలీసులు అనుమానిస్తున్నారు.