AP Crime: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్ కర్రి చంద్రరేఖ (30) నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వృత్తిరీత్యా ఎంతో మందికి ప్రాణదానం చేయాల్సిన వైద్యురాలు, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.
ఘటనకు గల కారణాలను పరిశీలిస్తే.. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం ఆమెకు ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పెళ్లి విషయంలో గత కొద్దిరోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె, విధి నిర్వహణలో ఉంటూనే ప్రాణాంతక నిర్ణయం తీసుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం చంద్రరేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తోటి సిబ్బంది సైతం ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: భయం గుప్పిట్లో కామారెడ్డి.. గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు మిస్సింగ్
ప్రస్తుతం యలమంచిలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణానికి కేవలం వివాహ సంబంధిత ఒత్తిడే కారణమా లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పని చేస్తున్న కర్రి చంద్ర రేఖ (30)
పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రరేఖ… pic.twitter.com/DkGsLIom0t
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2026