Nallamala Forest: నల్లమల అటవీ ప్రాంతం మరోసారి నిప్పుల కొలిమిలా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయ సమీపంలోని అటవీ కొండల్లో భారీగా కార్చిచ్చు రేగింది. ఎండల తీవ్రతకు తోడు ఎండుటాకులు, వెదురు పొదలు తోడవడంతో మంటలు క్షణాల్లో విస్తరిస్తున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో అటవీ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండాల్సిన అడవి, ఇప్పుడు అగ్నికీలల మధ్య చిక్కుకుని విలవిల్లాడుతోంది.
వన్యప్రాణుల విలవిల.. వణుకుతున్న సరిహద్దు గ్రామాలు!
ఈ భారీ అగ్నిప్రమాదం అటవీ సంపదకే కాకుండా, మూగజీవాలకు పెను శాపంగా మారింది. మంటల ధాటికి తాళలేక వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీస్తున్నాయి. మరోవైపు, మంటలు అదుపుతప్పి జనావాసాల్లోకి వస్తాయేమోనన్న భయంతో సమీప గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గాలి దిశ మారుతున్న కొద్దీ పొగ కమ్మేస్తుండటంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అటవీ సరిహద్దు గ్రామాలైన గాజులపల్లి, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: ఏపీలో వింత వాతావరణం.. ఒకచోట భానుడి భగభగలు.. మరోచోట వరుణుడి పలకరింపు!
రంగంలోకి యంత్రాంగం.. మంటలను అదుపు చేసేందుకు పోరాటం
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, కొండ ప్రాంతం కావడం, వాహనాలు వెళ్లేందుకు వీలులేని దట్టమైన అడవి కావడంతో మంటలను ఆర్పడం సవాలుగా మారింది. ఫైర్ బీటర్లతో మంటలు పక్కకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. వేసవిలో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అడవిని కాపాడుకోవడంలో ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి కార్చిచ్చు
మహానంది ఆలయం సమీపంలో భారీగా ఎగసిపడుతున్న మంటలు
భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు
Wildfire Erupts Once Again in the Nallamala Forest Region pic.twitter.com/dxTjNpL2rS
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2026