Faridabad Gang Raped: కామంలో కళ్లు మూసుకుపోతున్నారు కామాంధులు. రోడ్డుపై ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు, మృగాళ్లుగా మారిపోతున్నారు కొందరు యువకులు. సభ్య సమాజం తలదించుకునే ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఓ మహిళను రెండున్నర గంటలపాటు వ్యాన్లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు. ఈ ఘటనలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది?
హర్యానాలో దారుణం.. రెండున్నర గంటలపాటు
హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఓ మహళకు వ్యాన్లో లిఫ్ట్ ఇచ్చారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత రాక్షసుల మాదిరిగా మారిపోయారు. తొలుత వ్యాన్ని గుర్గావ్ రోడ్డు వైపు మళ్లించారు. దాదాపు రెండున్నర గంటల పాటు వ్యాన్ని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తిప్పుతూ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాధితురాలు ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు, ఆమెపై బెదిరింపులకు దిగారు. మంగళవారం వేకువజామున అంటే మూడు గంటల ప్రాంతంలో ఎస్జీఎమ్ నగర్లోని రాజా చౌక్ సమీపంలో ఆమెని వ్యాన్ నుంచి బయటకు తోసేశారు. దీంతో బాధిత మహిళ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాధితురాలు తన సోదరికి ఫోన్ ద్వారా ఈ విషయం చెప్పింది.
లిఫ్ట్ అడిగిన పాపానికి వ్యాన్ లో సామూహిక అత్యాచారం
వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ముఖానికి వైద్యులు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. బాధితురాలి సోదరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక విషయాలు ప్రస్తావించింది.
ఘటన జరగడానికి ముందు రోజు అంటే సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆ మహిళ తనకు ఫోన్ చేసిందని తెలిపింది. తన తల్లితో గొడవ పడ్డానని స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపింది. మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పిందని పేర్కొంది. చివరకు కామాంధులు చేతిలో అత్యాచారానికి గురైంది.
ALSO READ: పాదచారులపైకి దూసుకెళ్లిన వాహనం, ఆ తర్వాత ఏం జరిగింది?
మహిళ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ సమస్యల నేపథ్యంలో కొద్దిరోజులుగా భర్త నుండి దూరంగా ఉంటోంది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోలుకున్న తర్వాత బాధితురాలు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు పోలీసులు.