Tirumala Hills: తిరుమల ఏడు కొండల స్వామి దర్శనానికి వెళ్లడానికి ఏడు నడకమార్గాలు ఉన్నాయట. ఏడు మార్గాల నుంచి స్వామి వారి ఆనందనిలయం చేరుకోవచ్చట. అయితే ఏడు నడక మార్గాలు ఎలా ఉన్నాయి.. ఎక్కడి నుంచి ఆ మార్గాలు మొదలవుతాయో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగవైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఏడు కొండలకు నడుచుకుంటూ వెళ్లడానికి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు తిరుమల గిరిల నుంచి స్వామి వారి ఆలయానికి చేరుకోవడానికి రెండు నడక మార్గాలు మాత్రమే అందరికి తెలిసిన విషయం కానీ స్వామి కొండ మీదకు వెళ్లడానికి కూడా మరో ఐదు నడకమార్గాలు కలుపుకుని మొత్తం ఏడు మార్గాలు ఉన్నాయట. అసలు ఆ మార్గాల పేర్లు ఏంటి..? అవి ఎక్కడి నుంచి మొదలై కొండ మీద ఎక్కడ కలుస్తాయి. అవి ఎప్పడు అందుబాటులో ఉంటాయా..? లేక ఏదైనా సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయా లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
అలిపిరి నడకదారి: తిరుమలకు అత్యధికంగా భక్తులు నడిచి వచ్చే మార్గమిది. తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ల నుండి తితిదే ఉచిత బస్సులను అలిపిరి వరకు నడుపుతోంది. కొంత మెట్ల మార్గం, కొంత నడక దారి ఉన్నది. ఈ దారిలో మొత్తం 3650 మెట్లు ఉన్నాయట.
శ్రీవారి మెట్టు నడకదారి: నారాయణవనంలో పద్మావతీ అమ్మవారిని వివాహం చేసుకుని, శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో కొంత కాలం నివసించిన వెంకటేశ్వర స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని ప్రతీతి. సాక్షాత్తూ శ్రీవారే వాడిన మార్గం కాబట్టి ఈ దారిని శ్రీవారి మెట్టు అని పిలుస్తారు. అలిపిరి తర్వాత ఎక్కువ మంది భక్తులు ఈ దారి గుండానే తిరుమల చేరుకుంటారు. రాయచోటి, పలమనేరు మీదుగా తిరుపతి వచ్చే భక్తులకు, చంద్రగిరి నుండి వచ్చే భక్తులకి అనువైన మార్గం (తిరుపతి వెళ్ళవలసిన అవసరం లేకుండా). శ్రీవారి మెట్టు అన్ని నడక మార్గాల్లోకి ప్రాచీనమైనది, మొట్టమొదటిది. అలిపిరి మార్గంతో పోలిస్తే మెట్ల సంఖ్య, దూరం తక్కువ. అయితే శ్రీవారి మెట్టు నుంచి అన్ని వేళలా ప్రవేశం ఉండదు.
తాళ్లపాక – కుక్కలదొడ్డి: తిరుమలకు చేరుకునే మూడవ నడకదారి ఇది. పద కవితా పితామహుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారట. శ్రీవారి ఆలయం నుండి జాపాలి తీర్థం, వేణుగోపాల స్వామి గుడికి వెళ్లే మార్గంలో శ్రీవారి పార్వేట మండపం వస్తుంది. అ పార్వేట మండపం దగ్గరే ఈ దారి కలుస్తుంది.
తరిగొండ వెంగమాంబ మార్గం: శ్రీవారి ప్రీతికరమైన భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నడుచుకుంటూ తిరుమల చేరుకున్న మార్గం. భాకరాపేట, శేషాచలం అడవులు, తలకోన, మొగలిపెంట, యుద్దగల్ల తీర్థం, గుండా తిరుమలలోని తితిదే వేద పాథశాల దగ్గర కలుస్తుంది ఈ దారి. అ దారి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండదు.
కడప సోమేశ్వరాలయం, కుక్కలదొడ్డి: తిరుమలకు తొలి గడప కడప నుంచి కూడా నడకదారి ఉంది అంటారు. ఆ దారే ఈ దారి. ఇది తిరుమలలో తుంబుర తీర్థం దగ్గర కలుస్తుంది. ఇది కూడా ఎక్కవ వాడుకలో లేని మార్గం.
పాలకొండల మార్గం: నుండి పాలకొండల మధ్య నుంచి యుద్దగళ్ళ తీర్థం మీదుగా తిరుమల చేరే మార్గం. ఇది కూడా అందుబాటులో లేని మార్గం.
కరకంబాడి – అవ్వాచారి కోన: తిరుమలకు వెళ్లడానికి ఉన్న ఏడవ మారగమే కరకం బాడి, అవ్వాచారి కోన మార్గం. తిరుమల ఏడు కొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు. ఇది కూడా అందుబాటులో లేని మార్గం.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.