Lighting Lamp: హిందూ సంస్కృతిలో “దీపం జ్యోతి పరబ్రహ్మ” అని అంటారు. అంటే దీపమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే.. దీపం వెలిగించేటప్పుడు అది ఏ దిశకు అభిముఖంగా ఉండాలి. ఏ నూనె వాడాలి, ఏ వత్తులు వేయాలి అనే అంశాలపై స్పష్టమైన నియమాలు ఉన్నాయి. సరైన దిశలో దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా లభిస్తుంది.
దీపారాధన – దిశల విశిష్టత:
దీపం వెలిగించేటప్పుడు జ్యోతి (దీపపు కొండె) ఏ దిశలో ఉండాలనేది మన కోరికలు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం.. నాలుగు ప్రధాన దిశల ఫలితాలు ఇలా ఉన్నాయి.
1. తూర్పు దిశ:
దీపపు జ్యోతి తూర్పు వైపునకు తిరిగి ఉండటం అత్యంత శ్రేష్ఠం. తూర్పు సూర్యుడు ఉదయించే దిశ, ఇది జ్ఞానానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల..
కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు లభిస్తాయి.
మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది.
గ్రహ దోషాలు తొలగిపోతాయి.
2. ఉత్తర దిశ:
ఉత్తర దిశ కుబేరుడికి, లక్ష్మీదేవికి నిలయం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లేదా వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు దీపాన్ని ఉత్తర దిశగా వెలిగించాలి. దీనివల్ల..
సిరిసంపదలు పెరుగుతాయి.
తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది.
అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.
3. పడమర దిశ :
పడమర దిశ వరుణ దేవుడికి సంకేతం. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి.
శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది.
పితృ దోషాలు ఉంటే తొలగిపోతాయని కొందరు నమ్ముతారు.
అయితే.. తూర్పు, ఉత్తర దిశలతో పోలిస్తే దీనికి ప్రాధాన్యత తక్కువ.
4. దక్షిణ దిశ:
దక్షిణ దిశ యమధర్మరాజుకు అంతే కాకుండా పితృదేవతలకు సంబంధించినది. సాధారణంగా పూజ గదిలో దీపం దక్షిణం వైపు చూడకూడదు.
దక్షిణ ముఖంగా దీపం పెడితే అశుభం జరుగుతుందని, ఆర్థిక నష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.
కేవలం పితృ కార్యాల సమయంలో లేదా యమ దీపం వెలిగించేటప్పుడు మాత్రమే ఈ దిశను ఉపయోగిస్తారు.
వత్తులు, నూనె ప్రాముఖ్యత:
దీపం దిశతో పాటు మనం వాడే వత్తులు కూడా ముఖ్యం.
ఫత్తి వత్తులు: సాధారణ పూజకు శ్రేష్ఠం.
తామర వత్తులు: సంపద కోసం లక్ష్మీదేవి పూజలో వాడతారు.
అరటి నార వత్తులు: శాంతి కోసం వాడతారు.
ఇక నూనె విషయానికి వస్తే.. ఆవు నెయ్యి అత్యంత పవిత్రమైనది. నువ్వుల నూనె శని దోష నివారణకు, విప్ప నూనె కులదైవ ప్రార్థనకు ఉపయోగిస్తారు.
దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:
దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద పెట్టకూడదు. ఒక చిన్న ప్లేట్ లేదా తమలపాకు మీద ఉంచాలి.
ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు.
పూజ ముగిసిన తర్వాత దీపం ఆరిపోయే వరకు చూడకూడదు. నెమ్మదిగా కొండెక్కిన తర్వాతే శుభ్రం చేయాలి.