Mada Veedhulu: మాఢ వీధులంటే అర్థం తెలుసా..? మాఢ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.? తిరుమలలో ఎన్ని మాడ వీధులుంటాయో తెలుసా..? తిరుమలలోని మాడ వీధుల ప్రత్యేకత ఏంటో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో ఎప్పుడు వినే పేర్లు మాడ వీధులు.. చాలా మంది భక్తులు ఈ పేర్లు వినే ఉంటారు. కానీ ఆ వీధులకు మాడ వీధులని పేర్లు ఎలా వచ్చాయో చాలా మంది భక్తులు తెలియదు.. ఇంకా తిరుమలలో ఎన్ని మాడ వీధులున్నాయో కూడా చాలా మందికి తెలియదు.. తెలిసినా తిరుమల మాడవీధుల ప్రత్యేక బహుశా కొద్ది మందికి మాత్రమే తెలుసి ఉంటుంది.
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే వారు.. అలా అర్చకులు నివసిస్తున్న వీధులను పవిత్రంగా బావించి.. వాటిని తమిళంలో ‘మాడాం’ అని పలిచేవారట. కాలక్రమేణా మాడాం అనే పదమే మాడవీధులుగా మారిపోయిందట.
ఒకప్పుడు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావట. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం కొండ మీద చేసిన మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారట. అయితే శ్రీరామానుజుల వారు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ వీధుల ఏర్పరచి ఆ వీధుల్లో స్వామి వారు ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారట. తర్వాత తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారట.
తిరుమల ఆలయం చుట్టూ మొత్తం నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.
తూర్పు మాడ వీధి: ఆలయం తూర్పు ముఖంగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవట.
పడమర మాడ వీధి: ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.
ఉత్తర మాడ వీధి: పుష్కరిణి ఉన్న వీధినే ఉత్తర మడవీధి అంటారు. ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మఠం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేదట. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేదట. ఆమె సమాధి తరిగొండ బృందావనం – ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.
దక్షిణ మాడ వీధి: ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట. ఈ వీధి మొదట్లో ‘ఊంజల్ మండపం’ ఉంది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.