Narasimha Swamy: తిరుమలలో నరసింహ్మస్వామి ఉంటాడని ఎంత మందికి తెలుసు..? నరసింహ్మ స్వామి ఏంటి..? తిరుమలలో ఉండటమేంటి అనుకుంటున్నారా..? నరసింహ్మ స్వామి ఒక్కరే కాదు హనుమంతుడు, శ్రీకృష్ణుడు కూడా దర్శనమిస్తాడు. అయితే తిరుమల కొండ మీద ఏక్కడో ఒక చోట వారి ఆలయాలు ఉన్నాయేమో అనుకునేరు.. అసలు కాదు.. శ్రీవారి దర్శనారికి వెళ్తున్న ఆనంద నిలయం దగ్గరే వారంతా కొలువై ఉన్నారు. చాలా మంది శ్రీవారి దర్శనం హడావిడిలో పడి మిగతా దేవీదేవతలను గమనించరు. మరి వాళ్లంతా శ్రీవారి ఆలయంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. చాలా మంది భక్తులకు తెలియని విషయం ఏంటంటే శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలోనే ఆలయంలోకి ప్రవేశించాక చాలా మంది దేవుళ్లు దర్శనమిస్తారు. కానీ క్యూలైన్లో తోపుళ్లు ఉండటం చేత చాలా మంది భక్తులు మిగతా దేవుళ్లను గమనించరు. కానీ ఈసారి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లినప్పుడు మిగతా దేవుళ్లను ఓ కంటి చూసి దర్శనం చేసుకోండి.
శ్రీవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ప్రధాన గాలి గోపురం దాటి లోపలికి ప్రవేశించగానే.. స్వామి వారి మహా ద్వారానికి ఎడమ చేతి వైపు రంగనాయక మండపము ఉంటుంది. ఆ తరువాత తిరుమల రాయ మండపము వస్తుంది. కుడి చేతి వైపు ధ్వజ స్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్థంభం ప్రక్కనే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దాటుకుంటూ ముందుకు వెళితే వెండి వాకిలి వస్తుంది. ఈ వెండి వాకిలి దగ్గరే అందరూ దేవుళ్లు దర్శనం ఇస్తారు.
ఈ ద్వారపు లోపలి భాగం మరియు గోపురం శైలిని బట్టి ఇది చోళుల కాలం అంటే సుమారు 13వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు భావిస్తారు. ఈ ద్వారాన్ని వెండితో తాపడం చేయించినందున దీనికి ‘వెండివాకిలి’ అనే పేరు వచ్చింది. 12 మరియు13వ శతాబ్దాల కాలంలో పాండ్య రాజులు, ముఖ్యంగా జటావర్మ సుందరపాండ్యుడు ఆలయానికి అనేక స్వర్ణ వెండి కానుకలు సమర్పించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ తర్వాతి కాలంలో విజయనగర రాజులు మరియు మైసూర్ సంస్థానాధీశులు కూడా ఈ వెండి పనుల పునరుద్ధరణకు సహకరించారు. వెండివాకిలి తలుపులపై మరియు దాని చుట్టూ ఉన్న గోడలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
నరసింహస్వామి: వెండి వాకిలి ద్వారం పైన శ్రీ నరసింహస్వామికి సంబంధించిన వివిధ రూపాల శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఇక్కడే స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు.
వైష్ణవ ముద్రలు: వెండి వాకిలోనే వైష్ణవ ముద్రలు అయిన శంఖు, చక్ర మరియు తిరునామ చిహ్నాలు వెండి తాపడంపై స్పష్టంగా కనిపిస్తాయి.
కృష్ణుడి లీలలు: వెండి తలుపులపై శ్రీకృష్ణుని బాల్య లీలలు, కాళీయ మర్దనం వంటి దృశ్యాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడే మనం శ్రీ కృష్ణ పరమాత్మను దర్శించుకోవచ్చు.
ఆంజనేయస్వామి: వెండి వాకిలి ద్వారానికి ఇరువైపులా హనుమంతుని విగ్రహాలు మరియు గరుత్మంతుని రూపాలు కనిపిస్తాయి.
ఈ విగ్రహాలను మనం స్వామి వారిని దర్శించుకునే ఆత్రుతలో గమనించము కానీ ఈసారి తిరుమల వెళ్లినప్పుడు తోపులాటలు గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా మిగతా అందరి దేవుళ్లను దర్శనం చేసుకుంటూ శ్రీవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుని రండి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.