Hyderabad: హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతంలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ-TGFSL అగ్నిప్రమాదం గురించి కొత్త విషయాలు బయటపెట్టారు అధికారులు. ప్రభుత్వం చేపట్టిన కేసులకు సంబంధించి ఫైళ్లు కాలిపోయాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఆ విభాగం అధికారులు. కేవలం ఊహాజనిత వార్తలేనని, అన్ని కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలు సురక్షితంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం గురించి
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో ఎఫ్ఎస్ఎల్ భవనంలోని మొదటి అంతస్తులోని ఓ గది నుంచి పొగలు రావడం గమనించారు అక్కడ సిబ్బంది. వెంటనే ఆ ఉద్యోగి.. సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ప్రమాదం గుర్తించిన ఉద్యోగి.. అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన స్మోక్ అలారం వ్యవస్థ హెచ్చరిక శబ్దం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టెండర్లు ల్యాబ్కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చింది అగ్నిమాపక సిబ్బంది.
ఆ ఫైల్స్ సేఫ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఈ ప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్తో పాటు మొదటి అంతస్తులోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు.
చాలా కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్, ఫోరెన్సిక్ సామగ్రి సురక్షితంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. జరిగిన ఘటన, నష్టంపై కొన్ని మీడియా ఛానెళ్లలో జరుగుతున్న వార్తలను ఖండించారు అధికారులు. నిర్ధారణ లేని, ఆధారాలు లేని కథనాలు వెలువడుతున్నాయని అన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అనవసర ఊహాగానాలు నివారించాలని సంయమనం పాటించాలని టీజీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తెలిపారు.
ALSO READ: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!