Puri JagannathTemple: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రసిద్ధ ఛార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటిగా వర్ధిల్లుతున్నది. బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకతో పాటు జగన్నాథపురికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినది. ఈ రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు, వింతలు విశేషాలు ఉన్నాయి. వాటిలో యమ శిల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలోని పురాతన ఆలయాలలో పూరీ జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి. ఒడిషా తీర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముడు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఏ పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. ఈ రహస్యాలలో ఆలయ మెట్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆలయ మెట్లలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే..
మూడవ మెట్లుగా యమ శిల
పూరి జగన్నాథుడిని దర్శించుకుంటే పాపాలు అన్నీ పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలా మంది హిందువులు జీవితంలో ఒక్కసారైనా అయోధ్యతో పాటు పూరి జగన్నాథుడిని దర్శించుకోవాలని భావిస్తారు. శ్రీకృష్ణుడు ఆయన సోదరుడు బలరాములు, సోదరి సుభద్రతో ఇక్కడ దర్శనం ఇస్తారు. జగన్నాథుడిని దర్శించి కోరుని కోరికలు నెరవేరడంతో పాటు సకల పాపాలు తొలగిపోతాయని ఆలయ పండితులు చెప్తారు. అయితే. ఈ ఆలయంలోని అత్యంత ప్రసిద్ధమైన 22 మెట్లలో మూడో మెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది.
మూడవ మెట్టుకు, యముడికి సంబంధం
పురాణాల ప్రకారం.. జగన్నాథుడు తనను దర్శించుకునే భక్తుల పాపాలు తొలగించడంతో అందరూ నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్లడం మొదలు పెట్టారు. నరకానికి ఎవరూ రాకపోవడంతో యమధర్మ రాజు జగన్నాథుడి దగ్గరికి వెళ్లి.. మీరు ప్రజల పాపాలు తొలగించడం వల్ల నరకానికి ఎవరూ రావడం లేదని విన్నవించారట. యమ ధర్మరాజు మాట విన్న జగన్నాథుడు.. ఆలయ ప్రధాన ద్వారం ముందున్న మూడవ మెట్టు నీదే. దాన్ని యమ శిల అని పిలుస్తారని చెప్పారట. భక్తులు నన్ను దర్శించుకుని వెనుదిరిగే సమయంలో ఎవరైనా దాని మీద కాలు పెడితే, అతడి పుణ్యాలు అన్నీ పోయి, యమలోకం వస్తాడని పూరీ జగన్నాథుడు చెప్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.
మూడవ మెట్లు మీద పెట్టకుండా ఆలయ అధికారుల ఏర్పాటు
పూరీ జగన్నాథుడి ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే సమయంలో మొత్తం 22 మెట్లు ఉంటాయి. కింద ఉన్న మూడవ మెట్టును యవ శిలగా పిలుస్తున్నారు. భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో ఈ మెట్టు మీద అడుగు పెట్టకూడదని ఆలయ పండితులు చెప్తారు. అంతేకాదు. ఈ మెట్టును భక్తులు ఈజీగా గుర్తు పట్టేలా నలుపు వర్ణంలో తయారు చేశారు. ఇతర మెట్లతో పోల్చితే ఈ మెట్టు భిన్నంగా ఉంటుంది. అందుకే స్వామి వారి దర్శనం తర్వాత ఈ మూడవ మెట్టుపై కాలు పడకుండా బయటకు వెళ్లాలి. పొరపాటున ఈ యమశిల మీద కాలు పెడితే యమలోకానికి పోవడం ఖాయం అంటారు.
Read Also: పిల్లలకు నేర్పాల్సిన శక్తివంతమైన 11 హిందూ మంత్రాలు