Srisailam Temple Secrets: శ్రీశైల ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని రహస్య విశేషాలు తెలుసా..? నల్లమల్ల అడవుల్లోని మహిమగల శ్రీపర్వతంపై కొలువైన భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దివ్యమైన చరిత్ర చాలా మందికి తెలుసు కానీ అక్కడి రహస్యాలు ఎఃతో మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీశైల క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాల నిలయం. పురాణాలు మరియు భక్తుల అనుభవాల ప్రకారం శ్రీశైలంలో చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన మరియు రహస్య విశేషాలు శ్రీశైలంలో ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివ శక్తుల అరుదైన సంగమం శ్రీశైలం: భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా (భ్రమరాంబికా దేవి) వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీశైలం… శివుడు, పార్వతి ఇద్దరూ ఒకే ప్రాంగణంలో కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇలాంటి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు.. అలాగే శ్రీశైలం కొండలను శ్రీగిరి పర్వతాలు అంటారు. ఈ శ్రీగిరి పర్వతాలు భూమికి నాభిలాంటివని చెప్తుంటారు.
మనిషిలాగే ఉండే విగ్రహం: శ్రీశైలం అడవుల్లో ఉండే ఇష్ట కామేశ్వరి ఆలయం అత్యంత రహస్యమైనది. ఇక్కడి అమ్మవారి విగ్రహం శిలతో చేసినదైనప్పటికీ, తాకితే మనుషుల శరీరాన్ని తాగిన అనుభూతి వస్తుంది. చుట్టూ వర్షం పడినా ఈ గుడి ప్రాంగణంలో మాత్రం చిన్న చినుకు కూడా పడదని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి వెళ్లడం చాలా సాహసంతో కూడుకున్న పని దట్టమైన అడవిలో కేవలం ప్రత్యేక జీపుల ద్వారా మాత్రమే చేరుకోవాలి.
అమ్మవారి గుడి వెనక తుమ్మెదల శబ్దం: శ్రీశైలంలో కొలువైన భ్రమరాంబికా దేవి ఆలయం వెనుక భాగంలో గోడకు చెవి ఆన్చి వింటే ఇప్పటికీ తుమ్మెదల ఝుంకారం వినిపిస్తుందట. అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు భ్రమర (తుమ్మెద) రూపం ధరించినందున ఆమెకు ఆ పేరు వచ్చిందంటారు.
స్పటిక లింగాలు: శ్రీశైలంలోని కృష్ణా నది దగ్గర భక్తులు స్నానాలు చేసే ప్రాంతాన్నే పాతాళగంగ అని పిలుస్తారు. 11వ శతాబ్దంలో హోయసల రాజులు పాతాళగంగ నుండి స్పటిక లింగాలను సేకరించి, వాటితో అనేక దేవాలయాలను నిర్మించారని చెప్తుంటారు. పాతాళ గంగలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం.
భక్తుల లెక్కలు రాసే సాక్షి గణపతి: శ్రీశైల క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడి వివరాలను సాక్షి గణపతి నోట్ చేసుకుంటారని, ఆ సమాచారాన్ని కైలాసంలో ఉన్న శివుడికి సాక్ష్యంగా అందిస్తారని పురాణ గాథ. అందుకే భక్తులు తమ పేరు, గోత్రాన్ని ఈ స్వామికి చెప్పుకుంటారు.
మోక్షం ప్రసాదించే శిఖరం: శ్రీశైలంలో డోర్నాల రహదారిలో గుడి ఎదురుగా ఎత్తైన కొండ మీద ఉంటుంది శిఖరేశ్వరం. “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే” అంటుంటారు. అంటే ఈ శిఖరాన్ని దర్శించుకుంటే మళ్ళీ జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అక్కమహాదేవి గుహలు, కదళీవనం: కృష్ణా నది మార్గం ద్వారా చేరుకోగలిగే అక్కమహాదేవి గుహలు, కదళీవనం అత్యంత ప్రాచీనమైనవి. ఇక్కడ సిద్ధులు, యోగులు రహస్యంగా తపస్సు చేస్తుంటారని చెబుతారు. అలాగే దత్తాత్రేయ స్వామి అవతారమైన నృసింహ సరస్వతి స్వామి అంతర్ధానమైన కదళీవనం మరియు దత్త పాదుక కూడా ఇక్కడి దట్టమైన అడవుల్లోనే ఉన్నాయి. దత్త పాదుక వెళ్లాలంటే ఆ దత్తాత్రేయుడి అనుమతి ఉంటేనే సాధ్యమవుతుందని దత్త భక్తులు చెప్తుంటారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.