Navratri Day 5: నవరాత్రుల్లో ఐదవ రోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజిస్తారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యం, శ్రేయస్సు, అదృష్టానికి అధిదేవత. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రీ మహాలక్ష్మి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
పూజకు కావలసిన సామాగ్రి:
మహాలక్ష్మీ దేవి విగ్రహం లేదా పటం.
పసుపు, కుంకుమ, గంధం.
పువ్వులు (ముఖ్యంగా ఎర్ర గులాబీలు, తామర పువ్వులు).
మామిడి ఆకులు, తమలపాకులు, వక్కలు.
కొబ్బరికాయ.
దీపాలు, నూనె/నెయ్యి, వత్తులు.
పూజకు ఉపయోగించే గంట, కర్పూరం.
నైవేద్యం కోసం పాయసం, లడ్డులు లేదా ఇతర పిండి వంటలు.
పూజ విధానం:
శుభ్రత: పూజ ప్రారంభించే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేయాలి. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
ఆసనం: పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. దేవి పటం లేదా విగ్రహం ఉత్తరం ముఖంగా ఉండేలా చూసుకోవాలి.
సంకల్పం: “ఈ పూజను నేను నా కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాల కోసం చేస్తున్నాను” అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి.
దీపారాధన: రెండు దీపాలను వెలిగించి, అమ్మవారికి నమస్కరించాలి.
పూజ: అమ్మవారి విగ్రహం లేదా పటానికి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. ఆ తర్వాత తామర పువ్వులతో అమ్మవారిని పూజించాలి. “ఓం మహాలక్ష్మీయై నమః” అనే మంత్రాన్ని పఠిస్తూ పూలు సమర్పించాలి.
అష్టోత్తరం: శ్రీ మహా లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం ఈ రోజు చాలా ముఖ్యమైనది. ప్రతి నామానికి ఒక పువ్వును సమర్పించడం శుభప్రదం.
నైవేద్యం: అమ్మ వారికి ఇష్టమైన నైవేద్యాలు, ముఖ్యంగా పాయసం, లడ్డులు, లేదా బెల్లంతో చేసిన పిండి వంటలను సమర్పించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూరం వెలిగించి, హారతి ఇవ్వాలి.
ప్రార్థన: పూజ తర్వాత మీ కోరికలను మనస్ఫూర్తిగా అమ్మ వారికి నివేదించుకోవాలి. అమ్మ వారిని సంపద, ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థించాలి.
Also Read: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?
మహాలక్ష్మీ పూజ విశిష్టత:
మహాలక్ష్మి దేవి ఐశ్వర్య ప్రదాయిని. ఆమెను పూజించడం వల్ల ధన సమస్యలు తొలగిపోయి. అంతే కాకుండా జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున పూజ చేయడం వల్ల కేవలం ధనం మాత్రమే కాకుండా, జ్ఞానం, మంచి ఆరోగ్యం, కీర్తి కూడా లభిస్తాయి. నవ రాత్రి ఐదవ రోజు పూజను శక్తి వంతంగా భావిస్తారు. అందుకే ఈ రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మ వారిని ఆరాధిస్తారు. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో సకల సంపదలు లభించి.. సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున పూజ చేయలేని వారు, లక్ష్మీ దేవి స్తోత్రాలను, మంత్రాలను పఠించడం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.