 
					Karthika Pournami 2025: శ్రీ శివకేశవుల అనుగ్రహం కోసం అత్యంత పవిత్రంగా భావించే మాసంలో వచ్చే పండగే కార్తీక పౌర్ణమి. ఈ రోజు దీపారాధన, పుణ్యస్నానాలు, దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తిథి నవంబర్ 5వ తేదీ సూర్యోదయం సమయానికి ఉండటం వల్ల, ఆ రోజే కార్తీక పౌర్ణమి పండగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు పాటించాల్సిన నియమాలు, పూజా విధానం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజు పాటించాల్సిన నియమాలు:
కార్తీక పౌర్ణమి రోజున పాటించే ముఖ్యమైన నియమాలు, ఆచారాలు ఇవే..
1. పుణ్య స్నానం, ఉపవాసం:
నదీ స్నానం: ఈ రోజున నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. నదీ స్నానం వీలు కానివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు.
ఉపవాసం (వ్రతం): చాలా మంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసాన్ని సాయంత్రం దీపారాధన అనంతరం విరమించాలి.
2. దీపారాధన, పూజ:
దీపారాధన విశిష్టత: కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనకు అపారమైన పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజు 365 వత్తులతో దీపారాధన చేస్తే.. ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి.
ఎక్కడ వెలిగించాలి: శివ, విష్ణు ఆలయాల్లో.. తులసి కోట వద్ద, ఇంటి పూజ గదిలో.. ఉసిరి చెట్టు మొదట్లో దీపాలు వెలిగించాలి.
ఎలా వెలిగించాలి: దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించడం శ్రేష్ఠం. ముఖ్యంగా ఉసిరికాయలో నెయ్యి వేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
పూజ: ఈ రోజు శివకేశవులను (శివుడు, విష్ణువు) భక్తి శ్రద్ధలతో పూజించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఈ పౌర్ణమి రోజున అత్యంత ఫలప్రదం.
3. పారాయణం, దానం:
పారాయణం: కార్తీక పురాణం, శివ సహస్ర నామాలు, విష్ణు సహస్ర నామాలు వంటి పవిత్ర గ్రంథాలను చదవడం లేదా వినడం మంచిది.
దానధర్మాలు: పౌర్ణమి రోజు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం కలుగుతుందని విశ్వాసం. పేదవారికి.. బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్ర దానం లేదా దీపాలను (నూనె, వత్తులు) దానం చేయాలి.
Also Read: కార్తీక మాసంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు
కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత (విశిష్టత):
కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు.
త్రిపురాసుర సంహారం: ఈ పవిత్రమైన రోజునే శివుడు త్రిపురాసురులు అనే రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయానికి దేవతలందరూ ఆనందించి దీపాలను వెలిగించారు. అందుకే దీనిని ‘దేవ దీపావళి’ అంటారు.
విష్ణువు అవతారాలు: శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించింది కూడా ఈ రోజునే.
తులసి: తులసి మొక్క జన్మించిన పవిత్రమైన రోజుగా కూడా కార్తీక పూర్ణిమను భావిస్తారు.
ఈ రోజు నియమ నిష్టలతో పూజలు, దీపారాధన చేయడం ద్వారా పాప విమోచనం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం.