Ratha Saptami 2026: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథిని ‘రథ సప్తమి’గా జరుపుకుంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సృష్టి ప్రారంభంలో.. సూర్య భగవానుడి మొదటి కిరణాలు ఈ రోజున భూమిపైకి ప్రసరించాయని పురాణాలు చెబుతున్నాయి. 2026వ సంవత్సరంలో రథ సప్తమి మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘ఆదివారం’ నాడు రావడం విశేషం.
రథ సప్తమి 2026 తేదీ, శుభ ముహూర్తం:
క్యాలెండర్ ప్రకారం.. 2026లో సప్తమి తిథి వివరాలు..
సప్తమి తిథి ప్రారంభం: జనవరి 24 (శనివారం) అర్ధరాత్రి 12:40 గంటలకు.
సప్తమి తిథి ముగింపు: జనవరి 25 (ఆదివారం) రాత్రి 11:11 గంటలకు.
ముఖ్యమైన తేదీ: ఉదయ తిథి ప్రాధాన్యత ప్రకారం.. జనవరి 25 ఆదివారం నాడు రథ సప్తమి వేడుకలు నిర్వహించుకోవాలి.
ముఖ్యమైన సమయాలు:
అరుణోదయ స్నాన సమయం: ఉదయం 05:32 నుంచి 07:12 వరకు పుణ్య స్నానాలు చేయవచ్చు.
పూజ, దానాలకు శుభ సమయం: ఉదయం 11:13 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు దానాలు, పూజలు చేయడానికి మంచి సమయం.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
రథ సప్తమిని మాఘి సప్తమి, మహతి సప్తమి లేదా పుత్ర సప్తమి అని రకరకాలుగా పిలుస్తారు. సూర్య భగవానుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఇది. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడు జన్మల పాపాలు నశిస్తాయని అంతే కాకుండా.. చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని పద్మ , భవిష్య పురాణాలు పేర్కొంటున్నాయి.
పూజా విధానం:
రథ సప్తమి నాడు స్నానం, సూర్య నమస్కారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
పవిత్ర స్నానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. తలపై ఏడు జిల్లేడు ఆకుల, ఏడు రేగు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం ఈ పండగ ప్రత్యేకత.
దీపారాధన: ఆకులపై నువ్వుల నూనెతో దీపం వెలిగించి, దానిని తలపై ఉంచుకుని సూర్యుడిని ధ్యానించాలి. అనంతరం ఆ దీపాన్ని ప్రవహించే నీటిలో వదలాలి.
సూర్య అర్ఘ్యం: రాగి పాత్రలో నీరు తీసుకుని.. అందులో అక్షతలు, ఎర్రటి పువ్వులు, చందనం కలిపి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
మంత్రం: “సప్తసప్తివాహ ప్రీత్ సప్తలోకప్రదీపాన్, సప్తమ్య సహితో దేవ గృహాణార్ఘ్య దివాకర్”
Also Read: శివలింగం, జ్యోతిర్లింగం మధ్య తేడా ఏంటి ?
ముఖ్యమైన మంత్రాలు:
స్నానం చేసేటప్పుడు, పూజ సమయంలో ఈ కింది మంత్రాలను జపించడం వల్ల శుభం కలుగుతుంది.
స్నాన మంత్రం: “యద్ యజ్జన్మకృతం పాపం యచ్ జన్మాంతరార్జితం | తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ||”
అర్ఘ్య మంత్రం: “ఓం ఘృణి సూర్యాయ నమః” లేదా “ఓం నమో నారాయణాయ” అని జపిస్తూ పదహారు ఉపచారాలతో పూజ చేయాలి.
రథ సప్తమి పర్వదినం కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ప్రకృతితో మమేకమై ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున చేసే దానధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణులకు లేదా పేదలకు చేసే సహాయం అనంతమైన ఫలితాలను ఇస్తుంది. జనవరి 25న ఈ పవిత్ర నియమాలను పాటించి సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవ్వండి.