BigTV English

Kanchi Temple: కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి రహస్యం మీకు తెలుసా..?

Kanchi Temple: కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి రహస్యం మీకు తెలుసా..?

కంచి ఆలయంలో అసలు బంగారు బల్లి, వెండి బల్లి ఎందుకు ఉంటాయి..? వాటికి అక్కడ చోటు కల్పించింది ఎవరు..? వాటిని తాకితే దోష నివారణ అవుతుందనే నమ్మకం ఎప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. కంచి బల్లుల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఇళ్లలో బల్లులు ఎక్కడంటే అక్కడ కనపడుతుంటాయి. కూరలో బల్లిపడితే విషంగా మారుతుందని అంటారు, మన వంటిపై బల్లి పడినా ప్రమాదం ముంచుకొస్తుందని చెబుతారు. అయినా కూడా బల్లి మన ఇంట్లో ధైర్యంగా తిరుగుతుంటుంది. ఇక బల్లి శాస్త్రం అని ఒకటి ఉంటుంది. అంటే బల్లి మన శరీరంపై ఏ భాగంలో పడితే ఫలితం ఎలా ఉంటుందో అందులో చెబుతారు. అది పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా ఉంటుంది. బల్లి ఇంట్లో ఉండటం ఎంత సహజమో, అది ఏదో ఒక సమయంలో మన వంటిపై పడటం కూడా అంతే సహజం. అయితే అది వంటిపై పడితే కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి కథ గురించి చెబుతుంటారు పెద్దలు. అక్కడ బంగారు బల్లి, వెండి బల్లిని తాకి వస్తే బల్లి దోషం మనకు ఉండదని అంటారు. నేరుగా వాటిని తాకలేకపోయినా.. కంచి ఆలయాన్ని దర్శించి ఆ బల్లుల్ని తాకిన వారిని మనం తాకినా కూడా దోష పరిహారం అవుతుందంటారు.

కంచిలో బల్లుల కథేంటి..?
కంచి ఆలయంలో బంగారు, వెండి బల్లులకు సంబంధించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉంది. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారట. వారిద్దరూ ఓరోజు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అయితే ఆ బల్లిని గౌతమ మహర్షి గమనించారట. వారి నిర్లక్ష్యాన్ని ఆయన క్షమించలేదు. వారిని వెంటనే బల్లులుగా మారిపొమ్మని శపించారట. శాపవిముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పారట. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో ఉంటూ స్వామివారిని ప్రార్థించారని కథనం.


కొన్నాళ్లకు వారికి శాపవిమోచనం కలిగింది. ఆ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యంగా వున్నారట. స్వామివారు గౌతమ మహర్షి శిష్యులకు శాపవిమోచనం కలిగించడంతోపాటు.. వారిని బంగారు, వెండి రూపంలో బొమ్మలుగా ఉండమని, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తారట. సాక్షులుగా ఉన్న సూర్య చంద్రుల బొమ్మలు కూడా ఆ బల్లుల పక్కనే ఉండటం విశేషం. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. మరో కథలో సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు ఉంటుంది.

కంచి ఆలయం లోని ఈ బల్లి బొమ్మలను తాకడం వల్ల.. అప్పటి వరకు బల్లులు మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి నివారించబడతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకటం ద్వారా అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంది. కంచిలో వివిధ ఆలయాలు ఉన్నా.. వరదరాజ పెరుమాళ్ ఆలయం అన్నిటిలో ప్రత్యేకం. దీని పేరు వరదరాజ పెరుమాళ్ ఆలయంగా కంటే, బంగారుబల్లి ఆలయంగా ప్రసిద్ధి.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×