Lord shiva: హిందూ ధర్మంలో పరమశివుడిని ‘ముక్కంటి’ అని పిలుస్తాం. ఆయనకు ఉండే మూడు కళ్ళు కేవలం శారీరకమైనవి కావు. అవి లోతైన ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉన్నాయి. అలాగే.. మనిషి జీవితం, మరణం, తర్వాత జరిగే దాని గురించి వివరించే ‘గరుడ పురాణం’ మన సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. శివుడి మూడో కన్ను జ్ఞానానికి, లయానికి సంకేతమైతే.. గరుడ పురాణం కర్మ ఫలితాలను వివరిస్తుంది. ఈ రెండింటి వెనక ఉన్న ఆసక్తికరమైన నిజాలు, పురాణ గాథలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శివుని త్రినేత్రం, గరుడ పురాణ రహస్యాలు:
మన పురాణాలలో ప్రతి అంశం వెనక ఒక శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక కారణం దాగి ఉంటుంది. శివుడిని మనం ‘త్రినేత్రధారి’ అని ఎందుకు అంటాం? అలాగే గరుడ పురాణాన్ని చదవడానికి ఎందుకు భయపడతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మన సంస్కృతిలోని గొప్పతనం అర్థమవుతుంది.
శివుడికి మూడు కళ్ళు ఎందుకు?
శివుడికి ఉన్న రెండు కళ్ళు సూర్యచంద్రులకు సంకేతాలు. ఇవి ఇహలోకంలోని పగలు, రాత్రి, కాల గమనాన్ని సూచిస్తాయి. కానీ.. నుదుటిపై ఉండే మూడవ కన్ను ‘అగ్ని’ తత్వానికి , ‘జ్ఞానానికి’ ప్రతీక.
కామదహనం: పురాణాల ప్రకారం.. తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామి జన్మించాల్సి ఉంది. అప్పుడు శివుడి ధ్యానాన్ని భంగం కలిగించడానికి మన్మధుడు ప్రయత్నించగా.. శివుడు ఆగ్రహంతో తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అంటే.. మనలోని కోరికలను (కామాన్ని) జ్ఞానాగ్నితో దహించాలని దీని అర్థం.
అతీంద్రియ దృష్టి: మూడవ కన్ను అనేది మనలోని ‘ఆజ్ఞా చక్రం’ దగ్గర ఉంటుంది. ఇది బయటి ప్రపంచాన్ని చూడటానికి కాదు. మన లోపల ఉన్న పరమాత్మను దర్శించడానికి ఉపయోగపడుతుంది. అందుకే శివుడిని యోగేశ్వరుడు అంటారు.
కాల స్వరూపం: శివుడి మూడు కళ్ళు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి. ఆయన కాలాన్ని మించిన వాడు కాబట్టి ‘మహాకాళుని’గా కొలుస్తాం.
గరుడ పురాణం: మరణానంతర రహస్యాలు:
18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుడికి చేసిన ఉపదేశమే ఈ పురాణం. సాధారణంగా దీనిని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదువుతారు. కానీ ఇందులో కేవలం మరణం గురించే కాదు. జీవితాన్ని ఎలా గడపాలో కూడా ఉంది.
కర్మ సిద్ధాంతం: మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. పాపాలు చేస్తే యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇందులో వివరంగా ఉంటుంది. ఇది మనిషిని తప్పులు చేయకుండా భయపెట్టడానికే కాకుండా.. ధర్మ మార్గంలో నడిపించడానికి తోడ్పడుతుంది.
వైతరణి నది: మరణం తర్వాత ఆత్మ ప్రయాణంలో వైతరణి అనే భయంకరమైన నదిని దాటాల్సి ఉంటుందని.. బతికున్నప్పుడు దానధర్మాలు చేసిన వారు మాత్రమే దానిని సులభంగా దాటగలరని గరుడ పురాణం చెబుతోంది.
Also Read: తులసి మొక్కను ఈ దిశలో పెడుతున్నారా? అయితే అనారోగ్యం మీ వెన్నంటే ఉంటుంది!
పునర్జన్మ: ఆత్మ ఎలా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మారుతుందో.. గర్భస్థ శిశువు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా ఇందులో సైంటిఫిక్ పద్ధతిలో వివరించారు.
ఎందుకు తెలుసుకోవాలి?
శివుడి మూడో కన్ను మనకు “జ్ఞానాన్ని పెంచుకో” అని చెబుతుంటే.. గరుడ పురాణం “ధర్మంగా బతుకు” అని హెచ్చరిస్తుంది. ఈ రెండు అంశాలు మనిషిని పరిపూర్ణంగా మారుస్తాయి. శివుడి వినాశనం కొత్త సృష్టికి దారి తీస్తుంది. అలాగే గరుడ పురాణంలోని శిక్షల వివరణ మనిషిలో మార్పును తీసుకువస్తుంది.