BigTV English

Ratha saptami 2024 : ప్రణతోస్మి.. దివాకరమ్..!

Ratha saptami 2024 : ప్రణతోస్మి.. దివాకరమ్..!
Ratha saptami 2024

Ratha saptami Special story : సకల కాలాలకు కర్త, సకల కర్మలకూ సాక్షి, సకల జీవాలకూ ప్రాణాధారం.. సూర్యనారాయణుడు. ఉదయకాలంలో బ్రహ్మగా, మధ్యాహ్నం ఈశ్వరుడిగా, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా నిలిచి సకల లోకాలనూ కాపాడే దైవంగా వేదం ఆయనను కీర్తిస్తోంది. అలాంటి ప్రత్యక్ష నారాయణుడు ఆవిర్భవించిన అత్యంత పుణ్యప్రదమైన రోజే.. రథ సప్తమి.


పవిత్ర మాఘ మాసంలో సప్తమి రోజున వచ్చే ఈ పండుగ రోజు చేసే స్నానం, ఇచ్చే అర్ఘ్యం, చేసే నివేదన, పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. వీటి వల్ల ఎంతటి అనారోగ్యమైనా, జన్మాంతర పాపమైనా తొలగి పోతుందని, అకాల మృత్యువు దరిచేరదని, సకల విజయాలు చేకూరతాయని, మన ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి.

సూర్యుడి రథానికి ఒకే చక్రం ఉంటుంది. అదే కాలచక్రం. ఈ రథానికి గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ఠుప్, అనుష్ఠుప్, పంక్తి అనే ఏడు గుర్రాలుంటాయి. ఈ 7 గుర్రాలను వారంలోని ఏడు రోజులుగా, ఏడు రంగులుగా, సప్త ఛందస్సులుగానూ చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న 12 ఆకులుంటాయి. వాటిని నెలలుగా, రాశులుగా చెబుతారు. రథానికి ఉన్న రెండు ఇరుసులను రాత్రి, పగలుగా చెబుతారు. సూర్యుడి రథపు సారథి అనూరుడు. (ఇతడు గరుత్మంతుడి సోదరుడు). కశ్యపుడు, అదితి కుమారుడు గనుకే ఇతడికి ‘ఆదిత్యుడు’ అనే పేరు వచ్చింది.


రథసప్తమి రోజున నది, కాలువ, పుణ్యతీర్థం లేదా బావి వద్ద స్నానం చేయాలి. స్నానానికి ముందు 7 జిల్లేడు/ రేగు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని స్నానం చేయాలి. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పడు భూమిపై సూర్యకాంతి బాగా పడుతుంది. ఈ కాంతి జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్ల మీద, ప్రవహించే నీటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇలా స్నానం చేస్తే.. రాబోయే వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి లభిస్తుందని పెద్దలు చెబుతారు.

స్నానానికి ముందు ప్రమిదలో గానీ, ఆకుదొన్నెలో గానీ ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి పెట్టుకుని, నీటిలో మునక వేసి లేచిన తర్వాత దీపాన్ని తలపై పెట్టుకుని సూర్యుని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి. స్నానం తరువాత సూర్యుడికి ఎదురుగా నిలిచి మూడుసార్లు దోసిలితో నీటిని అర్ఘ్యం ఇవ్వాలి.

అర్ఘ్యం తర్వాత ఆదిత్యుడిని షోడశోపచారాలతో పూజించి, ఆవుపిడకల మంట మీద ఆవుపాలతో వండిన పొంగలిని నివేదించాలి. అలాగే పూజానంతరం పితృ దేవతలకు తర్పణాలను ఇవ్వాలి. ఈ రోజున నూనె లేకుండా చేసిన వంటకాలను మాత్రమే తినాలి. ఇవేవీ చేయలేని వారు ఉదయం స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా 7 సార్లు సూర్య నమస్కారాలు చేసినా చాలు.

పదహారు ఫలాల నోము, కైలాసగౌరి నోము ప్రారంభించేందుకు రథసప్తమి చాలా విశేషమైన రోజు. ఈ రోజున మొదలుపెట్టి, ఏడాదిలోపు ఎప్పుడైనా పూర్తిచేసి, ఉద్యాపన చెప్పుకోవచ్చు. ఒకవేళ రథసప్తమి నాడు నోము మొదలుపెట్టటం కుదరక పోతే. శివరాత్రి నాడు చేసుకోవచ్చు. ఈ రోజున అరసవిల్లిలోని సూర్య నారాయణ స్వామిని లేదా కోణార్కలోని సూర్య దేవాలయాన్ని దర్శించుకోవటం విశేష ఫలాన్నిస్తుంది. ఈ రెండు ఆలయాల్లో రథసప్తమి రోజు సూర్యకిరణాలు మూలమూర్తి పాదాల మీద పడటం విశేషం.

అలాగే ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని ఏడు వాహనాల మీద తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం 6 గంటలకు సూర్యప్రభ, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై శ్రీవారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించి, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×