Karthika masam: కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారజామున నుంచి ఆలయాలు, నదీ తీరాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా.. కార్తీక పౌర్ణమి నాడే కాకుండా, ఈ ఆఖరి రోజు కూడా శివాలయాలు, విష్ణు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఉదయం నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి, వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. పవిత్రమైన నదులు, చెరువులు, కోనేరుల్లో దీపాలను వదిలి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సాయంకాలం ఆలయాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నారు.
ఈ మాసం శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కావడంతో… నెల రోజుల పాటు శివ నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ భక్తులు నియమ నిష్ఠలతో గడిపారు. ఈ పవిత్ర మాసంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం నేటితో ముగియనుండడంతో… మళ్లీ ఏడాది పాటు ఈ వైభవం కోసం భక్తులు వేచి చూడనున్నారు.
శ్రీశైల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లాలో శ్రీశైలం మహాక్షేత్రానికి పోటెత్తారు భక్తులు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో.. మల్లన్న ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు భక్త జనం. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికీ.. స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది.
భక్తులతో కిక్కిరిసిన మహానంది ఆలయం
నంద్యాలలో మహానంది ఆలయానికి పోటెత్తారు భక్తులు. ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. వేకువ జాము నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల శివనామస్మరణతో మహానంది ఆలయం మార్మోగిపోయింది. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి.. భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.
భక్తులతో కిటకిట లాడిన అమరావతి శ్రీ బాల చాముండిగా ఆలయం..
పంచారామ క్షేత్రాలలో ప్రథమ ఆరామ క్షేత్రమైన అమరావతి శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి కార్తీక భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు.. స్నాన ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద మహిళా భక్తులు పెద్ద ఎత్తున దీపారాధనలు చేశారు. ఆలయ ప్రాంగణం హర హర మహాదేవ శంభో శంకర అనే నినాదంతో మారుమోగాయి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు.. స్పాట్లో 42 మంది మృతి..
ద్రాక్షారామ శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం పోటెత్తిన భక్తులు..
శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి, వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. కోనేరులో దీపాలను వదిలి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.
కార్తీక మాసం చివరి సోమవారం ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు pic.twitter.com/vhRT5qMuVZ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 17, 2025