Tirumala Timings: తిరుమలలో దర్శనం టైమింగ్స్ మారిపోయాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే టైమ్ స్లాటెడ్లో కఠిన నిబంధనలను అమలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఏ దర్శన సమయంలో కఠిన నిబంధలు తీసుకొచ్చిందో.. బ్రేక్ దర్శనాలను ఎందుకు..? ఎప్పుడు రద్దు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగవైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి వారి దర్శనానికి వివిధ మార్గాల ద్వారా భక్తులు చేరుకుంటారు. అందులో ముఖ్యమైనది ఎక్కువ మంది భక్తులు 300 రూపాయల స్లాటెడ్ సర్వ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ స్లాటెడ్ సర్వదర్శనంలోనే కీలకమైన నిర్దేశిత కాల పరిమితిని తీసుకొచ్చింది టీటీడీ. స్వామి వారి దర్శనానికి స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది.
ఈ నిబంధనను సోమవారం నుండి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని.. అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని టీటీడీ సూచిస్తుంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ అళ్వార్ తిరుమంజనం అంటే శ్రీవారి సుప్రబాతం, అర్చన సేవల తర్వాత గర్భగుడిలోని స్వామి వారి మూలవిరాట్ను పూర్తిగా వస్త్రంతో కప్పివేస్తారు. తర్వాత ఆలయ గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని నాముకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, పసుపు, కిచ్చలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఆలయాన్ని పూర్తిగా అంటే ఆనంద నిలయాన్ని, బంగారు వాకిలిని, శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలను ఆలయ ప్రాంగణాన్ని పూజా సామాగ్రిని అన్నింటిని పూర్తిగా శుభ్రం చేయడాన్ని కోయిల్ అళ్వార్ తిరుమంజనం అంటారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అందుకే మార్చి 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలకు తీసుకుని వచ్చే సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని అధికారులు, భక్తులకు సూచించారు. అలాగే మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు అధికారలు తెలిపారు. ఈ కారణంగానే మార్చి 18వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు.