మహాశివరాత్రి వచ్చేస్తోంది. ముందుగానే దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సందర్భంగా శివుడికి ఏ పూలు అర్పించాలి? ఏ పూలు వాడకూడదు? అనే విషయంపై చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. పూజలో పూలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి పువ్వుకు ఒక అర్థం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శివార్చనలో సాధారణంగా దొరికే పూలే ఎక్కువగా ఉపయోగిస్తారు. శివుడు సాదాసీదా జీవనానికి ప్రతీక కావడంతో అలంకారమైన లేదా విలాసవంతమైన వస్తువుల కంటే సాధారణ పూలను ఇష్టపడతారని నమ్మకం ఉంది.
ఈ పూలు వాడాలి
శివుడికి ఎంతో ఇష్టమైన వాటిలో బిల్వదళం మొదటి స్థానంలో ఉంటుంది. ఇది పువ్వు కాకపోయినా పూజలో అత్యంత ముఖ్యమైనది. అలాగే ధాతురా పువ్వు, ఉమ్మెత్త. శమీ పువ్వులు, అపరాజిత వంటి పూలను భక్తులు సమర్పిస్తారు. దాతూరా వంటి పువ్వులు విషపూరితమైనవి అయినప్పటికీ, సముద్ర మథనం సమయంలో ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు విషాన్ని తాగిన కథతో ఇవి సంబంధం కలిగి ఉందని నమ్మకం ఉంది. అందుకే ఈ పువ్వులను శివార్చనలో ప్రత్యేకంగా అర్పిస్తారు. తెల్లని లేదా సాధారణ రంగుల పూలను సమర్పించడం శివారాధనలో సాధారణంగా కనిపించే సంప్రదాయం.
Also read: Rice Porridge: ఉదయం పూట గంజి అన్నం తిన్నారంటే మీరు ఊహించని ప్రయోజనాలు
వీటిని వాడకూడదు
అయితే కొన్ని పూలను శివుడికి అర్పించరాదు అని కూడా సంప్రదాయాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మొగలి పువ్వులను శివార్చనలో వాడకూడదని పురాణ కథల్లో చెబుతారు. అలాగే సంపెంగ పువ్వులు, మల్లె పువ్వులు వంటి బలమైన వాసన కలిగిన పూలు, ఎండిపోయిన లేదా పాడైన పూలు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి పువ్వులను శివలింగంపై అర్పించరాదని నమ్మకం ఉంది. పూజలో ఉపయోగించే పూలు ఎప్పుడూ తాజావిగా ఉండాలి పురుగులు పట్టినవి లేదా పాడైనవి కాకూడదని కూడా సూచిస్తారు.
మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేస్తూ శివుని నామస్మరణ చేస్తారు. ఆ రోజు పూజలో పూలు, బిల్వదళం, పాలు, నీరు, గంగాజలం వంటి వాటిని సమర్పించడం ఆనవాయితీ. అయితే ప్రతి ప్రాంతంలో సంప్రదాయాలు కొంచెం మారవచ్చు. ముఖ్యంగా భక్తి, శ్రద్ధతో చేసే పూజే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. అందుకే మహాశివరాత్రి సందర్భంగా పూజ చేసే ముందు ఏ పూలు వేయాలి, ఏవి వేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకుని పూజ చేస్తే శివుని ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల విశ్వాసం.