రాష్ట్రంలోని మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 90 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. మున్సిపల్ ఓటర్లలో తిరుగులేని క్లారిటీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
గడిచిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇటీవలి సర్పంచ్ ఎన్నికల వరకు ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని ఆయన అన్నారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని.. ఇదే ఊపు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మొత్తం కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లో 90% కాంగ్రెసే గెలుస్తుంది : మంత్రి ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేయబోతోంది
మున్సిపల్ ఓటర్లు చాలా క్లారిటీతో ఉన్నారు
అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఎమ్మెల్సీ, జూబ్లీహిల్స్, పంచాయితీ
ఇలా అన్ని ఎన్నికల్లో… pic.twitter.com/U7vuwrHptz
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2026
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత పదేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన విమర్శించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పాలనలో పారదర్శకతకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని, దీనిని గమనిస్తున్న ఓటర్లు పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.
రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతోందని, విపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని, ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తి అని మరోసారి నిరూపిస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.