Idols: హిందూ సంప్రదాయంలో.. ఏ శుభకార్యానికైనా ముందుగా విఘ్నేశ్వరుడిని (గణేశుడిని) పూజించడం ఆనవాయితీ. ఎందుకంటే ఆయన అడ్డంకులను తొలగించే దేవత. ఇక లక్ష్మీ దేవి సంపదకు, శ్రేయస్సుకు అధిష్టాన దేవత. అందుకే.. విజ్ఞానం, అడ్డంకులు తొలగింపు (గణేశుడు) లేకుండా సంపద (లక్ష్మీ దేవి) నిలవదని నమ్మకంతో, ఈ ఇద్దరు దేవతలను కలిపి పూజించడం సర్వసాధారణం. ముఖ్యంగా దీపావళి పూజలలో వీరిద్దరి విగ్రహాలను ఉంచి పూజిస్తారు. అయితే.. ఈ విగ్రహాలను పూజామందిరంలో ఏ వైపున ఉంచాలనే విషయంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి.
వాస్తు శాస్త్రం, హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మీ గణేశ విగ్రహాల స్థాపనపై కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. సరైన స్థానం, దిశలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరిగి, సుఖసంతోషాలు, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు.
సరైన స్థానం :
లక్ష్మీ గణేపతి విగ్రహాల స్థాపనలో ప్రధానమైన నియమం. లక్ష్మీ దేవిని ఎల్లప్పుడూ గణపతిని కుడి వైపున ఉంచాలి.
ఎందుకు?
శాస్త్రపరమైన వివరణ: సాధారణంగా.. హిందూ ధర్మంలో భార్యాభర్తలు కూర్చున్నప్పుడు, భార్య భర్తకు ఎడమ వైపున కూర్చుంటుంది. ఇది “అర్ధనారీశ్వరుడి” భావనను సూచిస్తుంది. అయితే.. లక్ష్మీ దేవి, గణపతి భార్యాభర్తలు కాదు, వారికి తల్లీ-కొడుకు సంబంధం ఉందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. మరో ముఖ్యమైన వివరణ ఏమిటంటే..
పూజా క్రమం: పూజ చేసేటప్పుడు ముందుగా అడ్డంకులను తొలగించే గణపతిని పూజిస్తారు. ఆ తర్వాతే సంపదను ఇచ్చే లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. కాబట్టి.. గణపతిని ముందుగా స్థానం తీసుకుని, ఆయనకు కుడి వైపున లక్ష్మీ దేవిని ఉంచుతారు.
శక్తి ప్రవాహం: వాస్తు ప్రకారం.. లక్ష్మీ దేవిని గణపతిని కుడి వైపున ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు స్థిరంగా ఇంట్లో నిలుస్తాయని నమ్ముతారు.
గణపతి (విఘ్నహర్త) – ఎడమ వైపు: అడ్డంకులను తొలగిస్తారు.
లక్ష్మీ దేవి (ధన ప్రదాయిని) – కుడి వైపు: సంపదను ప్రసాదిస్తారు.
మీరు విగ్రహాల వైపు చూసినప్పుడు, గణపతి మీ కుడి వైపున (మీ ఎడమ చేతి వైపున), లక్ష్మీ దేవి మీ ఎడమ వైపున (మీ కుడి చేతి వైతి వైపున) కనిపించాలి.
విగ్రహాలు ఉంచాల్సిన దిశ:
వాస్తు ప్రకారం.. విగ్రహాలను ఉంచడానికి అత్యంత శుభకరమైన దిశ ఈశాన్య మూల. ఇది దైవిక శక్తులు, ప్రశాంతత, శుభప్రదమైన శక్తితో నిండిన మూలగా భావిస్తారు.
ప్రత్యామ్నాయ దిశలు: ఈశాన్యం సాధ్యం కాకపోతే.. తూర్పు లేదా ఉత్తర దిశలు కూడా శుభప్రదంగా చెబుతారు.
విగ్రహాలు ఏ వైపు చూడాలి: దేవతా విగ్రహాలు సాధారణంగా తూర్పు లేదా పడమర దిశకు చూసేలా ఉంచడం ఉత్తమం. మీరు పూజ చేసేటప్పుడు.. మీరు విగ్రహాలకు ఎదురుగా ఉండే దిశలో (ఉత్తరం లేదా తూర్పు) కూర్చుని పూజ చేయాలి.
ఈ విషయాలు పాటించండి:
భంగిమ: లక్ష్మీ దేవి, గణపతి ఇద్దరూ కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాలను ఉంచడం శ్రేయస్కరం. కూర్చున్న భంగిమ సంపదలో స్థిరత్వం, సుస్థిరతకు ప్రతీక.
తొండం: గణపతి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉండాలి. ఇది సుఖసంతోషాలు, విజయాన్ని సూచిస్తుంది. అంతే కాకుండా సులభంగా సంతృప్తి చెందే రూపంగా చెబుతారు.
స్థలం: విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. వాటిని గౌరవప్రదంగా ఒక వేదిక లేదా పీఠంపై ఉంచాలి.
సరియైన స్థానం, దిశ, పూర్తి భక్తితో లక్ష్మీ గణేశులను పూజించడం వల్ల ఇంట్లో జ్ఞానం, సంపద, విజయం సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.