Angkor Wat: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ‘అంగ్కోర్ వాట్’. ఇది కంబోడియాలో దేశంలో ఉంది. అద్భుతానికి ప్రతిరూపంలా అలరారుతోన్న ఈ ఆలయం ఎన్నో ఛేదించలేని మిస్టరీలతో నిండి ఉంటుంది. ఎందుకంటే.. ఈ గుడిలో అడుగడుగునా కనిపించే అద్భుతమైన కళా సంపద, గోడలపై కనిపించే రాతికళా నైపుణ్యం మనల్ని కట్టిపడేయటంతో పాటు ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు, మిస్టరీలు, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు ఆ ప్రాంతమంతా మన హిందూ రాజులు పరిపాలించిన కాంభోజి రాజ్యంలో భాగమే. 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నాటి చక్రవర్తి II సూర్యవర్మన్ నిర్మించారు. ఇది ప్రధానంగా వైష్ణవ ఆలయం. హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా దీన్ని నిర్మించారు. అలాగే ప్రధాన ఆలయంలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఇక ఆలయం చుట్టూ ఇతర దేవతలు కొలువైన వందల కొద్దీ ఉప ఆలయాలు ఉన్నాయి.
మహా రహస్యాల నిలయం అంగ్కోర్ వాట్.. ‘దేవాలయాల నగరం’ అని అర్థమట. ఆ కాలంలోనే ఇక్కడ దాదాపు 10 లక్షల వరకు జనాభా నివసించేవారట. ఆలయం చుట్టూ 200 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టు కొలత ఏకంగా 5 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఒక్క హిందూ మతమే కాదు.. అన్ని మతాలకు సంబంధించిన వాటిలో అంగ్కోర్ వాట్ అతి పెద్దది కావటం మరింత ప్రత్యేకమే మరి.
ఈ దేవాలయాన్ని రక్షించడానికి చుట్టూ దాదాపు 700 అడుగుల వెడల్పుతో కందకం నిర్మించబడింది. దూరం నుండి చూస్తే.. ఇది ఒక సరస్సులా కనిపిస్తుంది. ఆలయానికి పడమర వైపున ఈ కందకాన్ని దాటడానికి ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటి దాదాపు 1000 అడుగుల వెడల్పుతో ఆలయానికి వెళ్లే పెద్ద ద్వారం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక దేవాలయం కూడా అంగ్కోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయంగా పేరుగాంచింది.
ఈ విష్ణు దేవాలయం సనాతన ధర్మానికి ఒక నిదర్శనం. ఈ ఆలయ గోడలపై హిందూ గ్రంథాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఉంటాయి. వాటిలో అందమైన అప్సరసల చిత్రాలు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. అలాగే దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సాగర మథనం కథలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన ఈ అంగ్కోర్ వాట్ మీద బౌద్ధ మతం ప్రభావం చూపింది. తర్వాత బౌద్ధ సన్యాసులు దీనిని బౌద్ధారామంగా మార్చడానికి ప్రయత్నించారు. అయితే, ఆలయంలోని శిల్పాలను, దేవాలయాలను మార్చకుండా.. కేవలం బుద్ధుని విగ్రహాలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు. అలాగే 20వ శతాబ్దం ప్రారంభం నుండి ఇక్కడ జరిపిన పురావస్తు తవ్వకాలు ఖైమర్ మత విశ్వాసాలు, కళాఖండాలు, భారతీయ సంప్రదాయాల గురించి చాలా సమాచారం అందించాయి. దీంతో ఈ అంగ్కోర్ వాట్ దేవాలయాన్ని సందర్శించడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో అంగ్కోర్ వాట్ దేవాలయాన్ని కూడా చేర్చింది. అలాగే ఇక్కడ వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రత్యేకమైన నమూనాలను చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఆలయ అందాన్ని, చరిత్రను తెలుసుకోవడంతో పాటు, ఇక్కడే సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అందమైన దృశ్యాలను చూసి ఆనందిస్తుంటారు. అంతేకాదు.. సనాతన ధర్మం అనుసరించే ప్రజలు దీనిని పవిత్ర యాత్రగానూ భావిస్తారు.