Brahmanandam:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘హాస్యబ్రహ్మా’ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం (Brahmanandam)దాదాపు 1250కు పైగా చిత్రాలలో నటించి, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా పద్మశ్రీ హాస్యబ్రహ్మ గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ బ్రహ్మానందం పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ సంఘసంస్కర్త ‘సావిత్రిబాయి ఫూలే’ జయంతి రోజు ఒక కార్యక్రమంలో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై కొంతమంది ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మహిళల అణిచివేత పై బ్రహ్మానందం కామెంట్స్..
పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ఎంత గొప్ప కళాకారుడో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఆయన గొప్ప భక్తుడు కూడా. అంతేకాదండోయ్ తెలుగు పండితులు కూడా.. అలా సాహిత్యం, పురాణాలపై విశేషమైన పట్టు ఉన్న ఈయన, ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వేదాలు, మను చరిత్ర వంటి ప్రాచీన గ్రంథాల్లో మహిళల అణిచివేతపై కూలంకషంగా మాట్లాడిన విధానాన్ని, అలాగే గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి సాహిత్య విమర్శను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలోనూ రాణించాలంటే సావిత్రి భాయి ఫూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసిన ఆయన.. స్త్రీలు వంటింటికే పరిమితం చేయాలనే భావనలు పురాణాలలో కూడా ఉన్నాయని, మహిళలు చదువుకుంటే వర్షాలు పడవని ‘మనవు’లో ఉన్న విషయాలను కూడా ఆయన తెలియజేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పలువురు ఆయనపై దారుణమైన భాషతో దాడి చేస్తున్నారు. పురాణాలపై అవగాహన లేదని దుర్భాషలాడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
బ్రహ్మానందంపై దుర్భాషతో దాడి..
ముఖ్యంగా సాహిత్యం అంటేనే విమర్శ. ఈ విషయంలో బ్రహ్మానందం పై అర్థవంతమైన విమర్శలు చేయకుండా దిగజారి వ్యాఖ్యలు చేయడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్ల నుండి అన్ని మతాల పురాణాలు, గ్రంథాలలో మహిళల అణచివేత పై చర్చ జరుగుతూనే వస్తోంది. అప్పట్లో విమర్శకు, హేతుబద్ధతకు గౌరవంగా స్థానం కల్పించేవారు. మానవులు ఆధునికులు అయినా.. అనాగరిక భాష మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నాడు బ్రహ్మానందం మాట్లాడిన మాటల కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనపై విమర్శల దాడి జరుగుతోందని చెప్పవచ్చు.
బ్రహ్మానందం కెరియర్..
బ్రహ్మానందం విషయానికి వస్తే.. 2009లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈయన, గొప్ప హాస్యనటుడిగా 5 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. 6 సినీ మా అవార్డులతో పాటు 3 సైమా అవార్డులు కూడా అందుకున్నారు. అంతేకాదు 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రధానం చేసింది. ఇకపోతే కన్నెగంటి బ్రహ్మానందం అయిన ఈయన రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) హీరోగా నటించిన ‘ఆహానా పెళ్ళంట’ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham) ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలో హీరోగా నటించి, ఆ తర్వాత బిజినెస్ రంగం వైపు అడుగులు వేశారు.. చిన్న కొడుకు సిద్ధార్థ (Siddharth) డాక్టర్. ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.