Daasi Sudarshan: టాలీవుడ్ లో వరుస మరణాలు అందరిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతరాత్రి ప్రముఖ అనువాద రచయిత రామకృష్ణ మృతిచెందిన విషయం తెల్సిందే. ఆ ఘటనను ఇంకా మరువకముందే మరో మరణం సంభవించింది. ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. మిర్యాలగూడలోని తన స్వగృహంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
పిట్టంపల్లి సుదర్శన్.. ప్రభుత్వ కాలేజ్ లో ఒక డ్రాయింగ్ టీచర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు. నర్సింగరావు దర్శకత్వంలో 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. కేవలం చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా.. రచయితగా, కార్టూనిస్ట్ గా, పాత్రికేయుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇక ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.