Nayanatara V’s Dhanush: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)సెలబ్రిటీల డాక్యుమెంటరీలు తయారు చేస్తూ.. వారి నిజ జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli )డాక్యుమెంటరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నెట్ఫ్లిక్స్ త్వరలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) డాక్యుమెంటరీతో రాబోతోంది. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush )నయనతారకు లీగల్ నోటీసులు పంపారు ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార మూడు పేజీల సుదీర్ఘ పోస్ట్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి, ధనుష్ పై నిప్పులు చెరిగింది.
నయనతార అండగా స్టార్ హీరోయిన్స్..
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది సెలబ్రిటీలు నయనతారకు మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా ధనుష్తో పనిచేసిన ఎంతోమంది హీరోయిన్స్ నయనతారకు అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ధనుష్ తో పని చేసిన పార్వతి, అనుపమ పరమేశ్వర, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా నజీమ్ తోపాటు పలువురు స్టార్ సెలబ్రిటీలు నయనతారకు అండగా నిలుస్తున్నారు.
ధనుష్ కు పెరిగిన వ్యతిరేకత..
ఇకపోతే నయనతార చేసిన పోస్టులో న్యాయం ఉంది కాబట్టే ఆమెకు ఈ రేంజ్ లో మద్దతు పెరుగుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ధనుష్ తో పని చేసిన హీరోయిన్స్ ఇక్కడ నయనతారకు మద్దతు పలకడంతో ధనుష్ పై విమర్శలు వెలువెత్తుతున్నట్లు సమాచారం. వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. మరి దీనిపై ధనుష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్..
అసలు విషయంలోకి వెళ్తే.. 2015లో ధనుష్ నిర్మాణంలో నయనతార హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నానుమ్ రౌడీధాన్’. అయితే ఈ సినిమాలో కొన్ని క్లిప్స్ డాక్యుమెంటరీ లో ఉపయోగించుకోవడం కోసం “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్” కావాలి అని నయనతార ధనుష్ చుట్టూ రెండేళ్లు తిరిగింది. అయినా అంగీకరించలేదు. కానీ తన సినిమా కాబట్టి అందులోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో మూడు సెకండ్ల నిడివితో చూపించారు. అయితే ధనుష్.. వీటిని ట్రైలర్ చూసి తన అనుమతి లేకుండా తన సినిమాలోని క్లిప్స్ వాడుకున్నారని, నష్టపరిహారంగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు.
ధనుష్ పై ఫైర్ అవుతూ.. 3 పేజీల పోస్ట్ వదిలిన నయనతార..
దీంతో ఫైర్ అయిన నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో.. “మిస్టర్ ధనుష్.. మీరు మీ తండ్రి, అన్నయ్య సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారు. మీకు కష్టం ఎదురైన ప్రతిసారి కూడా వారు అండగా నిలిచారు. కానీ నేను అలా కాదు. నా కుటుంబం సినీ బ్యాక్ గ్రౌండ్ కాకపోయినా.. సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి నా టాలెంట్ తో రెక్కల కష్టంతో ఈ స్థాయికి వచ్చాను. ఇక నా కష్టాన్ని గుర్తించిన నెట్ ఫ్లిక్స్ నేడు డాక్యుమెంటరీ చేస్తుంటే చాలామంది నాకు సహాయపడ్డారు. కానీ మీరు మాత్రం మీ కుట్రను బయటపెట్టారు. నా సినిమాలోని క్లిప్స్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ 3 సెకండ్ల నిడివి ఉన్న ఒక క్లిప్పు కోసం ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేయడం మీరు నాపై ఏ రేంజ్ లో వ్యక్తిగతంగా కుట్ర పన్నుతున్నారో అర్థమవుతుంది” అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో సంచలనంగా మారింది.