Bus Accident: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూతన దంపతులు కొత్త జీవితం ప్రారంభం కావాల్సిన వేళ వారి కుటుంబాల్లో ఊహించని విషాధాన్ని నింపింది. పెళ్లి వేడుక ముగించుకుని అతిధులతో తిరిగి వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 16 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నూతన దంపతులు సేఫ్గా ఉన్నారు.
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు
నేపాల్లోని బైతాడి జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక ముగించుకుని పెళ్లికూతురు ఇంటి నుండి తిరిగి వివాహ అతిథులతో బయలుదేరింది ఓ బస్సు. రాత్రి 8 గంటల సమయంలో పుర్చౌరి మునిసిపాలిటీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. బద్గావ్ ప్రాంతంలోకి రాగానే మలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్పై నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్.
ఆ తర్వాత పక్కనే ఉన్న 200 మీటర్ల లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో ఎక్కువ మంది యువకులు, మధ్య వయస్సుల వారు ఉన్నారు.
8 మంది మృతి, 16 మంది పరిస్థితి విషమం.. నూతన దంపతులు సేఫ్
అసలే కొండ ప్రాంతం.. దీనికితోడు ఇరుకు, ప్రమాదకరమైన రోడ్లు ఈ ఘటన తీవ్రత పెంచింది. అయితే వధూవరులు బస్సులో కాకుండా వేరే వాహనంలో ప్రయాణించడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానిక ప్రజల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 60 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మరణించారని బైతాడి జిల్లా డీఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు నలుగురు బాధితుల గుర్తించారు. గాయపడిన 45 మంది ప్రయాణికులను చికిత్స కోసం కోటిలా హెల్త్ పోస్ట్కు తరలించారు.
ALSO READ: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి ఊహించని విషాదం
ఇటీవలి కాలంలో నేపాల్లో రోడ్డు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. పదేళ్ల కిందట ఏడాదికి 5 వేల ప్రమాదాలు జరిగేవి. 2024-25 ఏడాదిలో ఆ సంఖ్య 7,600 లకు చేరింది. గడిచిన ఏడాదిలో 190 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.