Glacier Melting: నేపాల్ అకస్మిక వరదలు రానున్న రోజుల్లో తీవ్రం కానున్నాయా? జరుగుతున్న పరిణామాలు హిమాలయాలకు ముప్పు పొంచి వుందా? రానున్నరోజుల్లో తీవ్రమయ్యే అవకాశం ఉందా? మానవుల మూత్రం కూడా దీనికి కారణ మన్నది పరిశోధకుల మాట. అదెలా సాధ్యం? దీని వెనుక అసలు ఏం జరుగుతోంది.
నేపాల్లో గతవారం సంభవించిన ఆకస్మిక వరదలు అంతులేని నష్టాన్ని మిగుల్చాయి. ఎల్నినో కారణంగా హిమాలయాల్లోని హిమానీ నదాలు కరుగుతున్నాయని అంచనా వేశారు పరిశోధకులు. వేలల్లో వేలాడే హిమానీ నదాలు ఉన్నాయని, వాటి వల్ల ముప్పు ముంచుకు రావచ్చని అంటున్నాయి. ఇదే క్రమంలో కొత్త విషయం బయటపడింది. మానవుల మూత్రం వల్ల కూడా హిమాలయ పర్వతాలకు ముప్పు ఉందని తేల్చి చెప్పారు. మౌంట్ ఎవరెస్ట్ మీద ఏటా పర్వతారోహకులు చేసే కార్యకలాపాలు ఖుంబు హిమానీ నదానికి పెద్ద సమస్యగా మారింది. పర్వతారోహకుల మూత్రం నుండి వెలువడే వేడి హిమానీనదం కరగడానికి దోహదపడుతోందని తేలింది. మానవ మూత్రం కంటే బేస్ క్యాంప్లో ఉత్పన్నమయ్యే వేడి మరింత పెద్ద ముప్పు ఉందని అంటున్నారు.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి వెళ్లే బేస్ క్యాంప్.. ఖుంబు హిమానీనదంపై నిర్మించారు. అక్కడ ప్రతీ ఏడాది సుమారు 1600 వరకు టెంట్లు ఏర్పాటు చేస్తారు. అందులో వంటగదులు, షవర్లు, జనరేటర్లు, వై-ఫై వంటి సౌకర్యాలు ఉంటాయి. కొన్నింటిలో ఫ్లోర్ హీటింగ్ సౌకర్యం ఉంది. వీటివల్ల ఉత్పన్నమయ్యే వేడి.. భూమి ఉష్ణోగ్రతను పెంచి హిమానీనదం కరగడాన్ని కారణమవుతుందని అంచనా వేశారు పరిశోధకులు. నేపాల్-అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ‘రీజనల్ ఎన్విరాన్మెంటల్ చేంజ్’ అనే పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మానవ కార్యకలాపాలు హిమానీ నదాలు కరగడానికి దోహదపడుతున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో సంభవించే తీవ్రమైన విపత్తులకు దీంతో ముడిపెడుతున్నారు.
పర్వతారోహకులు ఎత్తుకు వెళ్లేకొద్దీ నీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని తేలింది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే మానవుల మూత్ర పరిమాణాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని రాసుకొచ్చారు. 2023 ఏడాది పర్వతారోహణ సీజన్లో బేస్ క్యాంప్ వద్ద ప్రతిరోజూ సుమారు 6,766 లీటర్ల మూత్రం ఉత్పత్తి చేసినట్టు ప్రస్తావించారు. మూత్రంతో హిమానీనదాలు కరిగించడానికి గణనీయమైన వేడి ఉంటుందని ఖిమ్లాల్ గౌతమ్- అతని సహచరులు కనుగొన్నారు. ఆ సీజన్లో మానవ మూత్రం వల్ల వెలువడిన వేడి వల్ల దాదాపు 154 టన్నుల మంచును కరిగించిందని అంచనా వేశారు. హిమానీనదాలు కరగడానికి మానవ మూత్రం ప్రధాన కారణం కాదని, శరీరం నుండి మూత్రం బయటకు వచ్చిన తర్వాత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చల్లబడటం మొదలవుతుందని అంచనా వేశారు.
ఆ సమయంలో వేడి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే మంచును చేరుకుంటుందని, మిగిలినది గాలికి లేదా రాళ్లకు ఆవిరైపోతుందని రాసుకొచ్చారు. బేస్ క్యాంప్లో ఉపయోగించే ఇంధనం.. మానవ మూత్రం కంటే ఎక్కువ ముప్పును కలిగిస్తుందని తెలిపారు. మానవుల వల్ల హిమానీనదం కరగడానికి ఇంధన వినియోగం వల్ల సుమారు 94 శాతం కాగా, మూత్రం వల్ల సుమారు 6 శాతం దోహదపడిందని తేల్చేశారు. ఇతర ప్రాంతాల కంటే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. సైన్స్ అడ్వాన్సెస్ లో ప్రచురితమైన 2019 అధ్యయనం ప్రకారం.. 2000 ఏడాది తర్వాత దానికి ముందుకాలంతో పోలిస్తే.. మంచు కరిగిపోవడం దాదాపు రెట్టింపు అయింది. ఖుంబు హిమానీనదంలోని ఇతర భాగాలతో పోలిస్తే.. బేస్ క్యాంప్ వద్ద ఉపరితల ఉష్ణోగ్రతలు సంవత్సరానికి సుమారు 0.28 డిగ్రీల సెల్సియస్ వేగంగా పెరిగినట్టు అంచనా వేశారు.
ALSO READ: మిస్ వరల్డ్-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ.
ప్రస్తుత బేస్ క్యాంప్కు నైరుతి దిశలో రెండు ప్రదేశాలను ఆ బృందం గుర్తించింది. క్యాంప్ను తరలించడం లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కోవచ్చని, కొత్త ప్రదేశంలో క్యాంప్ను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ నష్టం, విపత్తు సంభవించే ప్రమాదం ఉందని అంటున్నారు. సౌరశక్తిపై అధికంగా ఆధార పడాలని సూచించారు. అలాగే ఖుంబు హిమానీనదాన్ని రక్షించడానికి బేస్ క్యాంప్లోని కొంత భాగాన్ని తరలించడం ఒక ప్రత్యామ్నాయంగా చెప్పారు. అదే సమయంలో మానవ నిర్మిత వేడిని నియంత్రించడం అవసరమని నొక్కి చెప్పారు పరిశోధకులు.