సుమారు ఆరు వేల ఏళ్ల క్రితం నాటి ఆసక్తికరమైన వార్త ఇది.. ఓ ఆదిమానవ సంతతికి చెందిన మహిళ బాతులు, ఈల్ చేపలు, హేజిల్ నట్స్ తినేదంట. ఆపై తన పనిలో నిమగ్నమై, రాతి పనిముట్లకు చెక్క పిడులను అమర్చడానికి బిర్చ్ బార్క్ పిచ్ (ఒక రకమైన జిగురు)ను నమిలి మెత్తగా చేసింది. అయితే, ఏ కారణం చేతనో ఆ జిగురు ముద్దను నమిలి పక్కకు పడేసింది… కాలగర్భంలో కలిసిపోయిన ఆ చిన్న ముద్ద ఇప్పుడు చరిత్రను తిరగరాస్తోంది.
డీఎన్ఏ ద్వారా గుర్తింపు
డెన్మార్క్లోని లోలాండ్ ద్వీపంలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ నమిలిన జిగురు ముద్ద లభించింది. దీనిని పరిశోధించగా.. ఆరు వేల ఏళ్ల క్రితం జీవించిన ఒక మహిళ డిఎన్ఏ లభ్యమైంది. ఆ ద్వీపం పేరు మీద పరిశోధకులు ఆమెకు లోలా అని పేరు పెట్టారు. సాధారణంగా పురాతన కాలం నాటి వివరాల కోసం ఎముకలు లేదా దంతాలను ఉపయోగిస్తారు.. కానీ కేవలం ఒక చూయింగ్ గమ్ ద్వారా ఒక వ్యక్తి రూపురేఖలు, ఆహారపు అలవాట్లను గుర్తించడం ఇదే మొదటిసారి.
లోలా ఎలా ఉండేదంటే..?
జెనెటిక్ విశ్లేషణ ప్రకారం.. లోలా నల్లటి జుట్టు, ముదురు రంగు చర్మం, నీలి రంగు కళ్లను కలిగి ఉంది. ఆమె ఆ కాలంలోని వేటగాళ్ల సమూహానికి చెందినదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆమె నోటిలోని బ్యాక్టీరియాను పరిశీలించగా.. ప్రస్తుత కాలపు ఆహార అలవాట్లకు భిన్నంగా, సహజసిద్ధమైన మాంసాహారం, విత్తనాలను ఆమె తీసుకున్నట్లు స్పష్టమైంది.
బిర్చ్ చెట్టు బెరడును వేడి చేయడం ద్వారా ఈ నల్లటి జిగురును తయారు చేసేవారు. దీనిని బాణం గుర్తులు, కత్తుల పిడులు అంటించడానికి వాడేవారు. అయితే, దీనికి యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల దంతాల నొప్పుల నివారణకు లేదా ఆకలిని మర్చిపోవడానికి (నేటి చూయింగ్ గమ్ లాగా) కూడా నమిలేవారని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న పిల్లల దంతాల గుర్తులు కూడా ఈ జిగురు ముద్దలపై కనిపించడం విశేషం.
‘ఒక వ్యక్తి ఏం తిన్నారో, వారి కళ్లు, జుట్టు రంగు ఏమిటో తెలుసుకోవడం అద్భుతం. ఇది ఒక రాతి యుగపు వ్యక్తి నాటి జీవన శైలి గురించి తెలుసుకోవడం సూపర్’ అని మ్యూజియం లోలాండ్-ఫాల్స్టర్ ప్రతినిధి సోరెన్ సోరెన్సెన్ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో స్వీడన్లో కూడా 10,000 ఏళ్ల నాటి జిగురు ముద్దలు దొరికినప్పటికీ.. లోలాకు సంబంధించిన వివరాలు అత్యంత సమగ్రంగా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన ద్వారా ప్రాచీన మానవుల జన్యువులే కాకుండా, వారి దైనందిన జీవితాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ALSO READ: Minister Seethakka: ములుగు బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభం.. ప్రారంభించిన మంత్రి సీతక్క