Artemis-2: అంతరిక్ష పరిశోధనల్లో మానవాళి మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసింది. పది రోజుల పాటు నింగిలో అద్భుత యానం చేసిన నలుగురు వ్యోమగాములు చంద్రుడి కక్ష్యను చుట్టి వచ్చి, ఈరోజు తెల్లవారుజామున క్షేమంగా భూమికి చేరుకున్నారు. ఈ విజయంతో చంద్రుడిపై మళ్ళీ మనిషి అడుగుపెట్టే రోజులు ఎంతో దగ్గరలో ఉన్నాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సముద్ర గర్భంలో సాఫీగా ల్యాండింగ్..
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం, ఆర్టెమిస్-2 క్యాప్సూల్ ఈరోజు తెల్లవారుజామున 5.38 గంటలకు భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో, శాన్ డియాగో వద్ద ఈ క్యాప్సూల్ సురక్షితంగా నీటిపై దిగింది (స్ప్లాష్ డౌన్). పారాచూట్ల సాయంతో అత్యంత వేగంగా వస్తున్న నౌకను అదుపు చేసి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సముద్రంలో ల్యాండ్ చేయడంలో నాసా బృందం విజయం సాధించింది.
చరిత్ర సృష్టించిన నలుగురు ధీరులు
ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష చరిత్రలో తమ పేర్లను లిఖించుకున్నారు. మిషన్ కమాండర్ రీడ్ వైజ్మాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టులు క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ఈ అద్భుత ప్రయాణంలో భాగస్వాములయ్యారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్ళిన మానవులుగా వీరు గుర్తింపు పొందారు. వీరి రాకతో అమెరికా అంతరిక్ష కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
పది రోజుల అద్భుత ప్రయాణం..
ఈ 10 రోజుల మిషన్లో భాగంగా వ్యోమగాములు భూమి నుండి బయలుదేరి చంద్రుడి వైపు ప్రయాణించారు. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపం వరకు వెళ్లి, అక్కడ కక్ష్యను విజయవంతంగా చుట్టేశారు. ఈ ప్రయాణంలో ఓరియన్ నౌక పనితీరును, లోపల ఉన్న జీవ పరిరక్షణ వ్యవస్థలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. రాబోయే ‘ఆర్టెమిస్-3’ మిషన్ ద్వారా చంద్రుడిపై మనుషులను దించడానికి అవసరమైన కీలక సమాచారాన్ని ఈ పర్యటన ద్వారా సేకరించారు.
Also Read: పాక్ ప్రభుత్వంలో ముదిరిన సంక్షోభం.. ఆర్మీ చీఫ్ జోక్యం.. ఇజ్రాయెల్ పై రక్షణ మంత్రి పోస్ట్ డిలీట్!
చంద్ర మండలంపై మనిషి అడుగుకు బాటలు
ఆర్టెమిస్-2 సక్సెస్ కావడం ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కేవలం చంద్రుడిని చుట్టి రావడం మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఇది తొలి మెట్టు. ఈ మిషన్ ఇచ్చిన విజయంతో, వచ్చే ఏడాది లేదా ఆపై ఏడాదిలో చేపట్టబోయే ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటి మహిళను, మొదటి నల్ల జాతీయుడిని దింపడమే నాసా తదుపరి లక్ష్యం. మానవ విజ్ఞాన శాస్త్రం మరో మలుపు తిరుగుతుందనడానికి ఈ విజయమే నిదర్శనం.
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 సక్సెస్
విజయవంతంగా చంద్రుడిని చుట్టేసిన ఆర్టెమిస్-2
తెల్లవారుజామున భూమికి చేరుకున్న ఆర్టెమిస్-2
ఉదయం 5.38కి క్షేమంగా దిగిన క్యాప్యూల్స్
10 రోజుల తర్వాత భూమికి చేరుకున్న ఆర్టెమిస్-2
కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో… pic.twitter.com/Z4J9Oh2f5B
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2026