Khawaja Asif Israel Comments Deleted: పాకిస్థాన్ రాజకీయాల్లో సైన్యం ఆధిపత్యం మరోసారి బహిర్గతమైంది. ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ జోక్యం చేసుకుని తొలగింపజేసినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ను మానవాళికి శాపం అంటూ ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది.
ఇజ్రాయెల్ను మానవాళికి శాపం, క్యాన్సర్ దేశం అని సంబోధిస్తూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ చేశారు. ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనూ లెబనాన్, గాజా, ఇరాన్లలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయితే, ఇజ్రాయెల్ నుండి బలమైన నిరసన వ్యక్తం కావడం.. మధ్యవర్తిగా పాక్ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడంతో, సైన్యం ఒత్తిడి మేరకు ఆయన తాజాగా ఆ వివాదాస్పద పోస్టును తొలగించడం గమనార్హం.
అయితే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ జోక్యంతో పాక్ మంత్రి ఖవాజా ఆ పోస్టును తొలగించారు. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ “జనహననానికి” పాల్పడుతోందని ఆయన ఆరోపించడంపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా స్పందించింది. “శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్పుకునే ఏ ప్రభుత్వం నుండి కూడా ఇటువంటి వ్యాఖ్యలను సహించలేము” అని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తూ పాక్ మధ్యస్థ పాత్రను ప్రశ్నించింది.
పాక్ మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తన సొంత నాయకత్వాన్ని నియంత్రించుకోలేని స్థితిలో ఇస్లామాబాద్ ఉందనే అభిప్రాయానికి వాషింగ్టన్ వస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన సున్నితమైన కాల్పుల విరమణ ప్రక్రియలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆ దేశ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.
ఎన్నికైన ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, విదేశీ విధానంపై ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యానిదే నిర్ణయాత్మకమైన నియంత్రణ అని ఈ నివేదిక పేర్కొంది. కాల్పుల విరమణ చర్చలు అత్యంత కీలక దశలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుండి వచ్చిన తీవ్ర ప్రతిఘటనతో పాక్ సైన్యం అప్రమత్తమైంది. తటస్థ మధ్యవర్తిగా పాకిస్థాన్ ఇమేజ్ దెబ్బతింటే అది అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ ఏకాకితనానికి దారితీస్తుందని సైన్యం భావిస్తోంది.
ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు కొరత, విద్యుత్ ధరల పెరుగుదలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి కాల్పుల విరమణ ఒప్పందం కుప్పకూలితే గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది పాకిస్థాన్పై పెను ప్రభావాన్ని చూపుతుందని, ఇంధన కొరత, ద్రవ్యోల్బణం వల్ల ఆ దేశం మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇజ్రాయెల్తో ఘర్షణ వైఖరిని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని సైన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: